UN Partners with Google: ఐరాస గణాంకాలకు ఏఐ టచ్.. గూగుల్తో కీలక భాగస్వామ్యం
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు తన విస్తృతమైన ప్రపంచ గణాంకాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి (UN) టెక్ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి 'యూఎన్ సిస్టమ్ డేటా కామన్స్'(UN System Data Commons) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న UNData పోర్టల్కు బదులుగా ఈ కొత్త వేదికను తీసుకొచ్చారు. గూగుల్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ 'డేటా కామన్స్' ప్లాట్ఫామ్పై ఇది పనిచేస్తుంది. వివిధ ఐరాస సంస్థలకు చెందిన గణాంకాలను వినియోగదారులు సాధారణ భాషలో ప్రశ్నలు అడిగి తెలుసుకునే అవకాశం ఇందులో ఉంటుంది.
వివరాలు
ఏఐ వ్యవస్థలకు నేరుగా అనుసంధానం
కొత్త వేదికలో 'మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్' (MCP) సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఏఐ వ్యవస్థలు ఇతర డేటా వనరులతో నేరుగా అనుసంధానం కావడానికి ఉపయోగపడే ప్రమాణమే MCP. ప్రస్తుత UNData పోర్టల్లో గణాంకాలను తెలుసుకోవాలంటే వినియోగదారులు స్వయంగా డేటాబేస్లో వెతికి, వివిధ విభాగాలను పరిశీలించాల్సి వచ్చేది.
కొత్త విధానంతో ఆ ఇబ్బంది తగ్గనుంది. ప్రపంచ గణాంకాలను ఏఐ వ్యవస్థలు మరింత సులభంగా ఉపయోగించుకోవడంతోపాటు, విశ్వసనీయమైన అధికారిక సమాచారాన్ని అందించడంలో వాటి కచ్చితత్వాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
వివరాలు
అధికారిక సమాచారం అందించడంలో ఏఐకి సవాళ్లు
అధికారిక గణాంకాలను విశ్వసనీయంగా అందించడంలో అనేక ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూనిసెఫ్ (UNICEF) ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచ అభివృద్ధి సూచికలకు సంబంధించిన ప్రశ్నలపై ఆరు పెద్ద భాషా నమూనాలను పరీక్షించారు.
1,33,000కు పైగా సమాధానాలను పరిశీలించిన ఈ అధ్యయనంలో సగటు కచ్చితత్వం కేవలం 21.2 శాతంగా నమోదైంది.
ఏఐ వ్యవస్థల్లో అధికారిక డేటా అందుబాటు, వినియోగ సౌలభ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని యూనిసెఫ్ ముఖ్య గణాంక నిపుణుడు జోవో పెడ్రో అజెవెడో తెలిపారు.
వివరాలు
2027 నాటికి 80 శాతం డేటా
డేటా కామన్స్ కార్యక్రమంలో ఐరాసకు చెందిన 26 సంస్థలు భాగస్వామ్యం చేసేందుకు అంగీకరించాయి.
ప్రారంభ దశలోనే దాదాపు 20 సంస్థలకు చెందిన డేటా అందుబాటులోకి రానుంది.
2027 నాటికి ఐరాస వ్యవస్థకు చెందిన 80 శాతం గణాంక డేటాసెట్లను ఈ వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివిధ ఐరాస సంస్థల సమాచారాన్ని ఏఐకి అనుకూలంగా మార్చడంతోపాటు, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ కార్యక్రమం కీలక ముందడుగు అని ఐరాస గణాంక విభాగం తాత్కాలిక డైరెక్టర్ శంతను ముఖర్జీ పేర్కొన్నారు.
వివరాలు
గూగుల్ నుంచి 2 మిలియన్ డాలర్ల సాయం
ఈ వేదికకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం గూగుల్ సంస్థకు చెందిన గూగుల్.ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల సామర్థ్య అభివృద్ధి నిధులను అందించింది.
సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోంది. ఈ వ్యవస్థ ఐరాస ఆధ్వర్యంలోని ప్రత్యేక వేదికపై నిర్వహించబడుతుందని గూగుల్ డేటా కామన్స్ విభాగం అధిపతి ప్రేమ్ రామస్వామి తెలిపారు.
భవిష్యత్తులో దీన్ని స్వతంత్రంగా నిర్వహించడం, కార్యకలాపాలు కొనసాగించడం, విస్తరించడం ఐరాస బాధ్యతగా ఉంటుందని ఆయన వివరించారు.
వివరాలు
గణాంకాల మూలాలను తెలుసుకునే అవకాశం
కొత్త వేదికలో ప్రతి గణాంకానికి సంబంధించిన మూలాన్ని కూడా నమోదు చేస్తారు.
దీంతో ఏఐ వ్యవస్థ ద్వారా పొందిన సమాచారాన్ని వినియోగదారులు అసలు ఐరాస వనరు వరకు వెళ్లి పరిశీలించవచ్చు.
ఏఐ ఆధారిత సమాచార వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సదుపాయం ఎంతో ముఖ్యమైనది.
MCP ద్వారా ఐరాస డేటాకు అనుసంధానమైన ఏఐ వ్యవస్థ ఒకేసారి పలు సూచికలను సేకరించి, వాటి ఆధారంగా డ్యాష్బోర్డులు, చార్టులు, రాతపూర్వక విశ్లేషణలను వినియోగదారులు మాన్యువల్గా శ్రమించకుండానే రూపొందించగలదని గూగుల్ ప్రదర్శించింది.