ODI World Cup 2027: 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండుగే.. 2027 వన్డే ప్రపంచకప్ కొత్త షెడ్యూల్, వేదికలివే..
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ మెగా టోర్నీని ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. భారత జాతిపిత మహాత్మా గాంధీకి గౌరవం చాటేలా.. ఆయన జయంతి రోజునే ప్రపంచకప్ను ప్రారంభించే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
వివరాలు
అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ప్రపంచకప్ సందడి..
దక్షిణాఫ్రికాతో మహాత్మా గాంధీకి ఉన్న సుదీర్ఘ చారిత్రక అనుబంధంతో పాటు ఆయన పాటించిన అహింసా సిద్ధాంతాన్ని గుర్తు చేసుకునే విధంగా ప్రపంచకప్ ప్రారంభ తేదీని ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా టోర్నీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 8న మొదలుకావాల్సి ఉంది.
దీనికి ముందు అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వార్మప్ మ్యాచ్లు నిర్వహించాలని భావించారు.
అయితే తాజాగా షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కొత్త ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 2న ప్రపంచకప్కు శ్రీకారం చుట్టి.. నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
వివరాలు
సరికొత్త ఫార్మాట్లో ప్రపంచకప్ పోటీలు..
దాదాపు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు మెగా టోర్నీ వినోదాన్ని అందించనుంది.
ఈసారి మొత్తం 14 జట్లు ప్రపంచకప్ టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి.
2027 ప్రపంచకప్లో పాల్గొనే జట్లలో ఇప్పటికే కొన్ని దేశాలు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి.
ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి.
ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం 10 జట్ల మధ్య క్వాలిఫయర్ పోటీలు జరగనున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ క్వాలిఫయర్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది.
వెస్టిండీస్, ఐర్లాండ్, నమీబియా వంటి జట్లు కూడా ఈ పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
వివరాలు
12 చారిత్రక మైదానాల్లో మ్యాచ్లు..
మరోవైపు ఈసారి ప్రపంచకప్ను గత టోర్నీలకు భిన్నమైన ఫార్మాట్లో నిర్వహించనున్నారు.
సరికొత్త సూపర్ సిరీస్ ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నట్లు సమాచారం.
దీంతో టోర్నీపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ నిర్వహణ కోసం ఆతిథ్య దేశాల్లోని మొత్తం 12 ప్రతిష్టాత్మక క్రికెట్ మైదానాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వీటిలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోనే 8 స్టేడియాలు ఉన్నాయి.
జింబాబ్వేలో మూడు మైదానాలు, నమీబియాలో ఒక వేదికను మ్యాచ్ల నిర్వహణకు ఎంపిక చేశారు.
కొత్తగా ఎంపిక చేసిన వేదికలతో పాటు మారనున్న టోర్నీ ఫార్మాట్, నిబంధనలు 2027 ప్రపంచకప్ను ప్రత్యేకంగా మార్చనున్నాయి.
ప్రపంచకప్ను గాంధీ జయంతి రోజున ప్రారంభించాలనే ఆలోచన కూడా ఈ టోర్నీకి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.