Loading...
Commonwealth Games: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తొలి రోజే రెండు విజయాలు!
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తొలి రోజే రెండు విజయాలు!

Commonwealth Games: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తొలి రోజే రెండు విజయాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కాట్లాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత జట్టు విజయాలతో ఖాతా తెరిచింది. తొలి రోజు లాన్‌ బౌల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి రెండు విజయాలు నమోదు చేశారు. మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో రూప రాణి టిర్కీ-పింకి సింగ్‌ జోడీ విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో పుతుల్‌ సోనోవాల్‌ సంచలన ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించాడు.

వివరాలు 

మహిళల పెయిర్స్‌లో రూప-పింకి జోడీ విజయం

మహిళల పెయిర్స్‌ విభాగంలో రూప రాణి టిర్కీ, పింకి సింగ్‌ జంట తమ తొలి మ్యాచ్‌లో మాల్టాకు చెందిన రెబెకా-కానీ లీ జోడీని టైబ్రేక్‌లో ఓడించింది.

మ్యాచ్‌ను భారత జంట దూకుడుగా ఆరంభించి తొలి సెట్‌ను 7-1 తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.

అయితే రెండో సెట్‌లో ప్రత్యర్థి జంట పుంజుకుని 4-3 తేడాతో విజయం సాధించడంతో స్కోరు 1-1తో సమమైంది.

దీంతో మ్యాచ్ టైబ్రేక్‌కు వెళ్లగా.. రూప, పింకి మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుని విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత జంట శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

వివరాలు 

ప్రపంచ ఛాంపియన్‌కు షాక్ ఇచ్చిన పుతుల్‌ సోనోవాల్

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాడు పుతుల్‌ సోనోవాల్ సంచలన విజయం నమోదు చేశాడు.

2023 ప్రపంచ ఛాంపియన్‌, కెనడాకు చెందిన ర్యాన్‌ బెస్టర్పై అతడు అద్భుతంగా పోరాడి గెలుపొందాడు.

తొలి సెట్‌లో పుతుల్ 5-4 తేడాతో పైచేయి సాధించాడు. రెండో సెట్‌లో బెస్టర్‌ పుంజుకుని 7-3తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు.

చివరకు టైబ్రేక్‌లో పుతుల్‌ అసాధారణ ఆటతీరుతో ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.

ADVERTISEMENT

వివరాలు

శుక్రవారం భారత అథ్లెట్ల పతక అవకాశాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో శుక్రవారం భారత్‌కు పలు విభాగాల్లో పతకాల ఆశలు ఉన్నాయి.

పవర్‌లిఫ్టింగ్

సాయంత్రం 5:40 గంటలకు: పురుషుల లైట్‌వెయిట్‌లో అశోక్‌ మలిక్, మహిళల లైట్‌వెయిట్‌లో పరమ్‌జీత్‌ కౌర్ పోటీలో పాల్గొంటారు.

రాత్రి 7:24 గంటలకు: మహిళల లైట్‌వెయిట్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ కౌర్, సుమన్‌ దేవి బరిలోకి దిగనున్నారు.

జిమ్నాస్టిక్స్

రాత్రి 10:00 గంటలకు: పురుషుల టీమ్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో భారత జట్టు పోటీపడనుంది.

లాన్‌ బౌల్స్‌లో తొలి రోజే రెండు విజయాలతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న భారత్‌.. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలతో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT