Team India: కీలక మ్యాచ్ ముందు టీమిండియాకు షాక్.. ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించిన అనిశ్చితికి చివరికి తెరపడింది. హైడ్రామాకు కారణమైన పాకిస్థాన్ జట్టు, చివరికి భారత్తో మ్యాచ్ ఆడేందుకు సమ్మతించింది. అయితే ఇదే సమయంలో భారత జట్టును కలవరపెట్టే కీలక వార్త ఒకటి బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
వివరాలు
వైద్యుల పర్యవేక్షణలో అభిషేక్
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యే అవకాశముంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్కు ముందే అతడికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఆ మ్యాచ్లో పాల్గొన్నాడు. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం అతని పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభిషేక్ వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఈ కారణంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్కు కూడా అతడు హాజరుకాలేకపోయాడు.
వివరాలు
అమెరికాతో మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో స్పందించారు. "అభిషేక్కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు కొనసాగుతున్నాయి. అయితే రెండు రోజుల్లో జరిగే మ్యాచ్కు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం" అని తెలిపారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. అనంతరం భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం జరిగే హ్యాండ్షేక్స్ సమయంలో కూడా అభిషేక్ కనిపించకపోవడంతో అప్పుడే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్
మరికొన్ని రోజుల్లోనే పాకిస్థాన్తో భారత్ మ్యాచ్ జరగనుంది. ఆలోపే అభిషేక్ పూర్తిగా కోలుకుని ఆ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో చేరినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్కు ముందే సుందర్ జట్టులో చేరాడు. "సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఈ రోజు జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడు," అని ఆయన వెల్లడించారు.