
Women's World Cup: మహిళల ప్రపంచకప్లో 'ఆజాద్ కశ్మీర్' రచ్చ..పాకిస్తాన్ కామెంటేటర్ పై తీవ్ర విమర్శలు చేసిన నెటిజన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్లో భారత జట్టుపై పాకిస్థాన్ ఆటగాళ్లు చూపిన ప్రవర్తన పెద్ద వివాదానికి దారితీసింది. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా మహిళల ప్రపంచకప్లో (Women's World Cup) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి. మ్యాచ్ మధ్యలో ఆమె 'ఆజాద్ కశ్మీర్' అనే పదాన్ని ప్రస్తావించడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అసలేం జరిగిందంటే..
వివరాలు
లాహోర్కు వచ్చి క్రికెట్లో రాణిస్తోంది
అక్టోబరు 2న కొలంబో వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో సనా మిర్ కామెంటేటర్గా వ్యవహరించింది. మ్యాచ్ సమయంలో పాక్ బ్యాట్స్మెన్ నటాలియా పర్వేజ్ బ్యాటింగ్లో ఉన్న సమయంలో, ఆమెను ఉద్దేశించి సనా మిర్ రాజకీయమయిన వ్యాఖ్యలు చేసింది. ''నటాలియా కశ్మీర్, ఆజాద్ కశ్మీర్కు చెందిన అమ్మాయి. లాహోర్కు వచ్చి క్రికెట్లో రాణిస్తోంది'' అంటూ సనా మిర్ కామెంట్రీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
వాస్తవానికి 29 ఏళ్ల నటాలియా పర్వేజ్ స్వస్థలం భీంబర్ జిల్లా. ఈ జిల్లా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భాగం. ఈ సందర్భంలో సనా మిర్ తన కామెంటరీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను 'ఆజాద్ కశ్మీర్' అని పేర్కొన్నారు. దీనిపై భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు "క్రీడల్లో రాజకీయాలను కలపకూడదని చెప్పేవాళ్లు తాము ఆజాద్ కశ్మీర్ అని ప్రస్తావించడం ఎందుకు?" అని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపింది. విమర్శల ప్రభావం గమనించిన సనా మిర్ స్పందిస్తూ, రాజకీయ ఉద్దేశ్యం కోసం ఇలా చెప్పనని, నటాలియాకు ఎదురైన కష్టాలను వివరించే సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించిందని వివరించారు.