LOADING...
Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్‌కు భారీ ఆర్థిక నష్టం!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్‌కు భారీ ఆర్థిక నష్టం!

Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్‌కు భారీ ఆర్థిక నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాల్గొనబోమని బంగ్లాదేశ్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలను చూపుతూ తమ జట్టును భారతదేశానికి పంపేందుకు నిరాకరించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధికారికంగా తన వైఖరిని వెల్లడించింది. భారతదేశంలో భద్రతా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని, ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదేనని యువజన, క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్లోబల్‌ క్రికెట్‌ పాలక సంస్థ తమ డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన, ఐసీసీ బంగ్లాదేశ్‌కు అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు.

Details

శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరిన బీసీబీ

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ గ్రూప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. భారతదేశంలో భద్రతా ముప్పు ఏమీ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ భారత్‌కు రావడానికి నిరాకరిస్తే ఆ స్థానంలో మరో జట్టును టోర్నమెంట్‌లోకి తీసుకుంటామని ఐసీసీ బీసీబీకి అల్టిమేటం జారీ చేసింది. అయినా కూడా బంగ్లాదేశ్‌ తన వైఖరిలో వెనక్కి తగ్గలేదు. ప్రపంచ కప్‌లో ఆడేందుకు సిద్ధమేనని, కానీ భారతదేశంలో మాత్రం కాదని బీసీబీ స్పష్టం చేసింది. చివరికి ఈ పరిస్థితుల్లో టీ20 ప్రపంచ కప్‌ నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్‌ నిర్ణయం తీసుకుంది.

Details

బీసీబీకి భారీ ఆర్థిక నష్టం

ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయ వాటాలో నుంచి దాదాపు 3.25 బిలియన్‌ బంగ్లాదేశ్‌ టాకా (సుమారు 27 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు లేదా దాదాపు రూ.240 కోట్లు) కోల్పోయే ప్రమాదం ఉంది. అదే విధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఇతర వాణిజ్య ఆదాయాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఆటగాళ్లకు అందాల్సిన మ్యాచ్‌ ఫీజులు, బోనస్‌లు, బహుమతి మొత్తాలు కూడా దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

Details

భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సిరీస్‌పై ప్రభావం

ఈ వివాదం ద్వైపాక్షిక క్రికెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య జరగాల్సిన బంగ్లాదేశ్‌ పర్యటనను భారత్‌ రద్దు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. టీవీ ప్రసార హక్కుల పరంగా ఈ సిరీస్‌ మిగిలిన 10 ద్వైపాక్షిక మ్యాచ్‌ల మాదిరిగానే కీలకమైనదిగా మారింది. దీని వల్ల బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు మరింత ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటన 2025లో జరగాల్సి ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటికే దానిని వాయిదా వేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు టూర్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా పరిణామాలతో ఆ షెడ్యూల్‌ కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది.

Advertisement