LOADING...
IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు లైన్ క్లియర్‌ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు.. 
ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు..

IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు లైన్ క్లియర్‌ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. భారత్‌తో మ్యాచ్‌కు దిగబోమని గతంలో పాకిస్థాన్‌ పట్టుబట్టినప్పటికీ, ఐసీసీ ఒత్తిడి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ఈ మ్యాచ్‌పై ఒక్కసారిగా భారీ ఆసక్తి పెరగడంతో, భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి కొలంబో వెళ్లే విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సాధారణ పరిస్థితుల్లో దిల్లీ నుంచి కొలంబో వెళ్లే విమాన టికెట్‌ ధర సుమారు రూ.30,000 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం అదే టికెట్‌ ధర రూ.90,000కు చేరింది.

వివరాలు 

అమాంతం పెరిగిన హోటల్‌ గదుల ధరలు

బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర అయితే ఏకంగా రూ.1,92,000 వరకు పెరిగింది. మరోవైపు ముంబయి నుంచి కొలంబో వరకు మూడు గంటల ప్రయాణానికి శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ ధర సుమారు రూ.40,000గా ఉంది. విమాన టికెట్లతో పాటు కొలంబోలో హోటల్‌ గదుల ధరలూ అమాంతంగా పెరిగాయి. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ప్రీమియం త్రీ స్టార్‌ నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో డబుల్‌ రూమ్‌కు ఒక్కరాత్రికి రూ.1.05 లక్షల నుంచి రూ.1.06 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఇవే గదుల ధరలు రూ.40,000 నుంచి రూ.50,000 మధ్యలో ఉండేవి.

వివరాలు 

పాకిస్థాన్‌ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన శ్రీలంక ప్రధాని

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన పరిష్కారంతో సంతృప్తి చెందడమే కాకుండా, మిత్రదేశాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు, ఐసీసీ మధ్య విస్తృత చర్చలు కొనసాగాయి. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణపై పునరాలోచించాలని శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డులు పీసీబీని కోరినట్లు సమాచారం. అలాగే భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని తాను పాకిస్థాన్‌ను విజ్ఞప్తి చేసినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లామ్‌ వెల్లడించారు. అంతేకాదు, శ్రీలంక ప్రధాని అనురకుమార పాకిస్థాన్‌ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా పాక్‌ ప్రభుత్వం తెలిపింది.

Advertisement