Commonweaith games: నేటి నుంచే కామన్వెల్త్ క్రీడల సందడి.. మూడు విభాగాల్లో పతకాలపై భారీ ఆశలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రతిష్ఠాత్మక బహుళ క్రీడల మహోత్సవానికి తెరలేచింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా 2026 కామన్వెల్త్ గేమ్స్ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈసారి గత ఎడిషన్లతో పోలిస్తే చాలా తక్కువ క్రీడాంశాలతో పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ, భారత్ ప్రధానంగా బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లోనే పతకాలపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుళ క్రీడల టోర్నీగా గుర్తింపు పొందిన కామన్వెల్త్ గేమ్స్లో ఈసారి 74 కామన్వెల్త్ దేశాలకు చెందిన సుమారు 3,000 మంది అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమయ్యారు. నాలుగువేదికల్లోనే 10 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. వీటిలో ఆరు క్రీడల్లో పారా అథ్లెట్ల కోసం ప్రత్యేక ఈవెంట్లను కూడా సమాంతరంగా నిర్వహించనున్నారు.
వివరాలు
భారత్కు గట్టి పరీక్ష..
గత మూడు దశాబ్దాల్లో అత్యంత పరిమిత స్థాయిలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్గా ఈ ఎడిషన్ ప్రత్యేకత సంతరించుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ గతంతో పోలిస్తే కొంత ప్రాధాన్యం కోల్పోయినప్పటికీ, 2030 ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్కు ఈసారి గ్లాస్గో గేమ్స్ ఎంతో కీలకంగా మారాయి.
గత రెండు దశాబ్దాలుగా వరుసగా టాప్-5 దేశాల్లో నిలుస్తున్న భారత్ అదే స్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే అది అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ వంటి భారత్కు బలమైన పతకాల అవకాశాలున్న క్రీడలను పోటీల నుంచి తొలగించారు.
వివరాలు
126 మంది భారత బృందం బరిలోకి..
2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సాధించిన మొత్తం 61 పతకాలలో 25 పతకాలు ఈ నాలుగు క్రీడల నుంచే రావడం గమనార్హం.
దీంతో గ్లాస్గోలో భారత బృందం మరింత కఠిన సవాల్ను ఎదుర్కోనుంది.
అంతేకాకుండా ఈసారి హాకీతో పాటు మరికొన్ని ఇతర క్రీడలకు కూడా చోటు కల్పించలేదు.
దీంతో భారత్ ఆశలన్నీ ప్రధానంగా అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్పైనే నిలిచాయి.
ఈసారి భారత్ మొత్తం 126 మంది క్రీడాకారులతో గ్లాస్గో గేమ్స్లో పాల్గొంటోంది.
వీరిలో అత్యధికంగా 32 మంది అథ్లెటిక్స్ జట్టుకు చెందినవారే. వారు మొత్తం 22 పతకాల ఈవెంట్లలో పోటీ పడనున్నారు.
వివరాలు
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వైపే అందరి చూపు..
రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి స్వర్ణ పతకానికి ప్రధాన ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు.
అయితే ఇటీవల రోమ్ డైమండ్ లీగ్లో 92.62 మీటర్ల త్రోతో ఆకట్టుకున్న శ్రీలంక అథ్లెట్ రుమేశ్ తరంగ అతడికి గట్టి సవాల్గా నిలవనున్నాడు. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ కూడా బలమైన పోటీదారుడిగా కనిపిస్తున్నాడు.
అథ్లెటిక్స్లో నీరజ్తో పాటు హైజంపర్ సర్వేశ్, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్తో పాటు పురుషులు, మహిళల 4×400 మీటర్ల రిలే జట్ల నుంచి కూడా భారత్కు పతకాలపై ఆశలు ఉన్నాయి.
అయితే ఈసారి అదే స్థాయి విజయాన్ని పునరావృతం చేయడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
వెయిట్లిఫ్టింగ్, బాక్సింగ్లోనూ భారీ అంచనాలు..
వెయిట్లిఫ్టింగ్లో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మొత్తం 11 మంది సభ్యులతో ఉన్న భారత వెయిట్లిఫ్టింగ్ జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు కూడా చోటు దక్కించుకున్నాడు.
బాక్సింగ్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (75 కేజీలు)పై అందరి చూపు నిలిచింది.
ఆమెతో పాటు జాస్మీన్ (57 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి (70 కేజీలు), నరేంద్ర బెర్వాల్ (+90 కేజీలు), సచిన్ సివాజ్ (60 కేజీలు) కూడా పతకాల కోసం బలమైన పోటీ ఇవ్వగల సామర్థ్యం కలిగిన బాక్సర్లుగా గుర్తింపు పొందారు.