LOADING...
IPL 2026 : క్రికెట్ మారిపోయింది.. ఐపీఎల్‌పై మాజీ దిగ్గజం హాట్ కామెంట్స్
క్రికెట్ మారిపోయింది.. ఐపీఎల్‌పై మాజీ దిగ్గజం హాట్ కామెంట్స్

IPL 2026 : క్రికెట్ మారిపోయింది.. ఐపీఎల్‌పై మాజీ దిగ్గజం హాట్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తుండటంతో బౌలర్లకు ఇది క్రికెట్ కంటే పీడకలలా మారిందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 260కి పైగా పరుగులు కూడా కేవలం 19 ఓవర్లలోనే ఛేజ్ అవుతుండటం ఈ ఫార్మాట్ ఎంతగా మారిపోయిందో చూపిస్తోంది. జస్పిత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం వికెట్లు తీయడంలో ఇబ్బందులు పడుతూ భారీగా పరుగులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ విషయంపై ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ కోచ్‌గా ఉన్న ఆయన, ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా ఒక భారీ బిజినెస్‌గా మారిపోయింది.

వివరాలు

వ్యాపారంలా తయారైంది

ప్రేక్షకులు స్టేడియంకి రావడం, టీవీల ముందు కూర్చోవడం ప్రధానంగా ఫోర్లు, సిక్సర్లు చూడటానికేనని మురళీధరన్ స్పష్టం చేశారు. ఒకవేళ పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉండి తక్కువ స్కోర్లు నమోదైతే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతారని చెప్పారు. దాంతో స్పాన్సర్లు, ప్రకటనలు, టీవీ వ్యూవర్‌షిప్ తగ్గి వ్యాపార పరంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుకే ఐపీఎల్‌ను బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుత తరం బ్యాటర్లు ఎంతటి బౌలర్లనైనా ఎదుర్కొనే ధైర్యంతో ఆడుతున్నారని మురళీధరన్ చెప్పారు. బుమ్రా వంటి బౌలర్ బంతులు వేసినా, యువ ఆటగాళ్లు ఎలాంటి భయం లేకుండా నో-లుక్ సిక్సర్లు కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

బ్యాటర్ల ఆలోచన విధానం మారిపోయింది

తమ కాలంలో పవర్‌ప్లేలో 40-50 పరుగులు గొప్ప స్కోర్‌గా భావించేవారని, ఇప్పుడు అదే స్కోర్ 80-90కి చేరుకుందని గుర్తుచేశారు. బ్యాటర్ల ఆలోచన విధానం కూడా మారిపోయిందని, ఇప్పుడు రక్షణ కంటే దాడి ప్రధాన లక్ష్యంగా మారిందని అన్నారు. స్పిన్నర్ల పరిస్థితి కూడా అంతే కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోలా బంతిని టర్న్ చేయడానికి ప్రయత్నించకుండా, వేగంగా వేసి బౌండరీలు నివారించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టుతున్నారని చెప్పారు. చిన్న వయస్సు నుంచే టర్న్ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, నేటి యువ ఆటగాళ్లు థ్రోడౌన్ బంతులను ఎదుర్కొని సిక్సర్లు కొట్టడంపైనే దృష్టి పెట్టుతున్నారని విమర్శించారు.

Advertisement

వివరాలు

ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బౌలర్లకు ఇబ్బంది

దీంతో స్పిన్నర్లు కూడా నెట్స్‌లో థ్రోడౌన్ బౌలర్లలా మారిపోతున్నారని వ్యాఖ్యానించారు. అదనంగా ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం కూడా బౌలర్లకు ఇబ్బందికరంగా మారిందని మురళీధరన్ అన్నారు. ఈ రూల్ వల్ల ప్రతి జట్టు ఒక అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతుందని, ఓపెనర్లు వికెట్ కోల్పోతామన్న భయం లేకుండా మొదటి బంతి నుంచే దాడి ప్రారంభిస్తున్నారని తెలిపారు. బౌండరీలను వెనక్కి జరిపినా పెద్దగా మార్పు ఉండదని, మొత్తం ఫార్మాట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే రూపొందించబడిందని, అందుకే బౌలర్లు దీనికి అలవాటు పడాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.

Advertisement