Dasun Shanaka : శ్రీలంక టీ20 కెప్టెన్కు షాక్..ఏడాదిపాటు ఆ క్రికెట్ బోర్డు నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను మధ్యలోనే వదిలేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరిన శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. ఒప్పంద నిబంధనలను అతిక్రమించిన కారణంగా అతనిపై ఒక సంవత్సరం పాటు పీఎస్ఎల్లో ఆడకుండా నిషేధం విధించింది. దీంతో 2027లో జరిగే పీఎస్ఎల్ 12వ సీజన్లో శనక పాల్గొనడం సాధ్యం కాదు. పీఎస్ఎల్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తరఫున శనక ఆడుతున్నాడు. అదే సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న సామ్ కరన్ గాయం కారణంగా తప్పుకోవడంతో, అతని స్థానంలో శనకను రూ.2 కోట్లకు జట్టులోకి తీసుకున్నారు.
వివరాలు
ఆ బౌలర్పై రెండేళ్ల నిషేధం
ఈ పరిణామంతో శనక పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఐపీఎల్లో చేరినట్లు సమాచారం. ఈ అంశంపై సమీక్ష చేసిన పీసీబీ, శనక నిర్ణయం ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుందని తేల్చింది. టోర్నమెంట్ ప్రతిష్టను కాపాడేందుకు ఇలాంటి చర్యలు అవసరమని స్పష్టం చేసింది. అయితే, తన నిర్ణయంపై శనక తీవ్రంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పీసీబీ తెలిపింది. "పీఎస్ఎల్ నుంచి వైదొలగినందుకు క్షమాపణలు కోరుతున్నాను. పాకిస్థాన్ అభిమానులను నేను గౌరవిస్తాను" అని శనక చెప్పినట్లు వెల్లడించింది. ఇటీవల ఇదే తరహా ఘటనలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ను వదిలేశాడని కారణంగా పీసీబీ అతనిపై రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే.