Page Loader
INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ 
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి భారత్ నిష్క్రమణ

INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యల నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది నిర్వహించనున్న ఆసియా కప్‌ టోర్నమెంట్‌ (Asia Cup 2025) నుంచి భారత్‌ వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్)కి సమాచారం ఇచ్చినట్లు పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సెప్టెంబరులో జరగబోయే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉన్న టీమ్‌ ఇండియా పాల్గొనే అవకాశాలు లేకపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు

అంతేకాకుండా, జూన్‌లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ నుంచి కూడా భారత్‌ వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్‌ మంత్రి,పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ అధ్యక్షత వహిస్తున్నారు.

వివరాలు 

ఏసీసీ నిర్వహించే ఈవెంట్లకు కూడా దూరం

ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ అధికారి మీడియాకు మాట్లాడుతూ.. "పాకిస్థాన్‌ మంత్రే ఏసీసీకి అధినేతగా ఉన్న సమయంలో అతని ఆధ్వర్యంలోని టోర్నీలకు భారత జట్టు హాజరుకాదు. ఇది మన దేశ భావోద్వేగానికి సంబంధించిన విషయం. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ నుంచి మేము మౌఖికంగా వైదొలగుతున్నామని ఏసీసీకి చెప్పాం. భవిష్యత్తులో ఏసీసీ నిర్వహించే ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి భారత ప్రభుత్వంతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం" అని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో,పాకిస్థాన్ క్రికెట్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల స్పాన్సర్లలో పెద్ద మొత్తంలో భారత కంపెనీలే ఉంటాయి.

వివరాలు 

 ప్రసార హక్కులు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా

ఇక ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లేకపోతే, దానికి బ్రాడ్‌కాస్టర్లు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు ఉండవు. అందువల్ల బీసీసీఐ లేకుండా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించవచ్చని బీసీసీఐ వర్గాల అభిప్రాయం. 2024లో ఆసియా కప్‌ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా సొంతం చేసుకుంది. వచ్చే ఎనిమిదేళ్ల పాటు ఈ టోర్నీలను ప్రసారం చేయాలని 170 మిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో టోర్నీ జరగకపోతే, ఈ ఒప్పందం కూడా రద్దయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

టీమ్‌ ఇండియా మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా..

2023లో జరిగిన ఆసియా కప్‌ ఎడిషన్‌పైనా భారత్‌-పాకిస్థాన్ మధ్య సంబంధాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆ ఏడాది టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినా, భారత్‌ తమ జట్టును అక్కడికి పంపించేందుకు అంగీకరించలేదు. దాంతో టీమ్‌ ఇండియా మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఇప్పటికే భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే వీరు తలపడుతున్నారు. ఇప్పుడు ఆసియా కప్‌ నుంచి భారత్‌ వైదొలగాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ టోర్నీని వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం.