LOADING...
MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. చెపాక్‌లో నేడు చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ!
ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. చెపాక్‌లో నేడు చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ!

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. చెపాక్‌లో నేడు చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆరాధ్య ఆటగాడు ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడా? ఈ ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే తన చివరి లీగ్ హోమ్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదే అతనికి చివరి మ్యాచ్ కావచ్చని, సొంత గడ్డపై అభిమానుల మధ్య గుడ్‌బై చెప్పవచ్చని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం ధోనీ గతంలో చేసిన వ్యాఖ్యలే కారణం.

వివరాలు

30 నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్

నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడాలని ఆశిస్తున్నానని ఆయన 2021లో చెప్పిన మాటను అభిమానులు ఇప్పుడు తరచుగా గుర్తుచేస్తున్నారు. ఈ సీజన్‌లో చెపాక్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఆ వ్యాఖ్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అదనంగా పిక్క కండరాల గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని 44 ఏళ్ల ధోనీ, హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు సుమారు 30 నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా ఈ అంచనాలకు మరింత ఊతమిచ్చింది.

వివరాలు

ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చెన్నైలో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. హిచ్‌కాక్ సినిమా తరహాలో ధోనీ అనూహ్యంగా మైదానంలోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రిటైర్మెంట్ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై గానీ, ఈ మ్యాచ్‌లో ఆయన ఆడతాడా అనే విషయంపై గానీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నుంచి లేదా స్వయంగా ధోనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

వివరాలు

గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం

ఇది పూర్తిగా అభిమానులు, మీడియా ఊహాగానాలపై ఆధారపడ్డ వార్త మాత్రమే. గాయం కారణంగా అతడిని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంచాల్సి వచ్చిందని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ బరిలోకి దిగుతాడా? ఒకవేళ దిగితే ఇదే అతని చివరి మ్యాచ్ అవుతుందా? అనే ఉత్కంఠకు టాస్ సమయానికైనా సమాధానం లభిస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement