PAK vs SL : పల్లెకెలెలో పాక్కు డూ ఆర్ డై మ్యాచ్.. శ్రీలంకతో కీలక సమరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సెమీఫైనల్ పోరు ఉత్కంఠతను తారాస్థాయికి చేర్చింది. శనివారం (ఫిబ్రవరి 28) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ పాకిస్థాన్కు 'చావోరేవో' సమరంలా మారింది. ఈ ఒక్క మ్యాచ్ ఫలితం పాక్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలవడంతో పాకిస్థాన్కు అనుకోని అవకాశ ద్వారం తెరుచుకుంది. అయితే కేవలం గెలవడం సరిపోదు. సెమీస్ చేరాలంటే భారీ సమీకరణాలను అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాక్ నెట్ రన్ రేట్ -0.461 కాగా, న్యూజిలాండ్ 1.390తో ముందంజలో ఉంది. కివీస్ను వెనక్కి నెట్టాలంటే శ్రీలంకపై విశేష ఆధిక్యంతో గెలవడం తప్పనిసరి.
Details
64 పరుగుల తేడాతో గెలవాలి
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే, కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఉదాహరణకు పాక్ 200 పరుగులు చేస్తే, లంకను 135లోపే ఆపాలి. ఒకవేళ 150కే పరిమితమైతే, ప్రత్యర్థిని 86 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే, లక్ష్యాన్ని మెరుపువేగంతో చేధించాలి. శ్రీలంక 150 చేస్తే, పాక్ 13.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. 200 పరుగుల భారీ టార్గెట్ అయితే, దానిని 13.5 ఓవర్లలో ముగించాలి. కాస్త ఆలస్యం జరిగినా నెట్ రన్ రేట్ దెబ్బతిని టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
Details
సొంతగడ్డపై అడుతున్న శ్రీలంక
ప్రతి బంతి ఇప్పుడు పాకిస్థాన్కు యుద్ధమే. ఇక శ్రీలంక తమ సొంత గడ్డపై ఆడుతుండటం పాక్కు మరో సవాల్. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలమా? లేక బ్యాటర్లకు సహకరిస్తుందా? అనేదే మ్యాచ్ను ప్రభావితం చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. బాబర్ ఆజం సేన ఈ అసాధ్య సమీకరణాలను సుసాధ్యం చేసి సెమీస్కు దూసుకెళ్తుందా? లేక నిరాశతో ఇంటి బాట పడుతుందా? అన్న ఉత్కంఠ కోట్లాది అభిమానులను కట్టిపడేస్తోంది.