LOADING...
IPL History: ఐపీఎల్ చరిత్రలో అదృశ్యమైన జట్లు ఇవే.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఐపీఎల్ చరిత్రలో అదృశ్యమైన జట్లు ఇవే.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

IPL History: ఐపీఎల్ చరిత్రలో అదృశ్యమైన జట్లు ఇవే.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందంజలో ఉంటుంది. ఈ టోర్నమెంట్‌ కొత్త సీజన్ 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో 19వ ఎడిషన్‌కు శ్రీకారం చుడతారు. ఈ ప్రయాణంలో ఐపీఎల్ అనేక ఆటగాళ్లకు పేరు తెచ్చినా, కొన్ని జట్లు మాత్రం కాలక్రమేణా కనిపించకుండా పోయాయి. 2008లో ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటివరకు 15 జట్లు పాల్గొన్నాయి. అయితే ప్రస్తుతం 10 జట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. మిగతా ఐదు ఫ్రాంచైజీలు వివిధ కారణాల వల్ల లీగ్ నుంచి తప్పుకున్నాయి. వీటిలో ఒకప్పుడు టైటిల్ గెలిచిన జట్టు కూడా ఉండటం విశేషం. ఇప్పుడు ఆ జట్ల గురించి చూద్దాం.

వివరాలు 

ఛాంపియన్ అయినా నిలవలేకపోయిన జట్టు

హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జర్స్ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది. 2008 తొలి సీజన్‌లో అట్టడుగున ముగించిన ఈ జట్టు, 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాతి సీజన్లలో కూడా ప్లేఆఫ్స్‌ దశకు చేరుతూ బలంగా కనిపించింది. అయినప్పటికీ, ఆర్థిక సమస్యలు జట్టును తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బ్యాంక్ గ్యారంటీ సమర్పణలో ఒక రోజు ఆలస్యం కావడంతో బీసీసీఐ ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రవేశించింది.

వివరాలు 

ఒకే సీజన్‌తో ముగిసిన ప్రయాణం

కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు 2011లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. మహేల జయవర్ధనే, బ్రెండన్ మెకల్లమ్, రవీంద్ర జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఈ జట్టు కేవలం ఒక్క సీజన్‌కే పరిమితమైంది. యజమానుల మధ్య విభేదాలు, అలాగే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేకపోవడం వల్ల బీసీసీఐ ఈ ఫ్రాంచైజీని రద్దు చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు బీసీసీఐని తప్పుబట్టి సుమారు రూ.800 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినా, ఆ జట్టు మళ్లీ లీగ్‌లోకి రాలేకపోయింది.

Advertisement

వివరాలు 

మూడు సీజన్లకే ముగిసిన పూణె కథ

సహారా గ్రూప్ ఆధ్వర్యంలో 2011లో ప్రారంభమైన పూణె వారియర్స్ ఇండియా జట్టు మూడు సీజన్లు మాత్రమే కొనసాగింది. మొదట 94 మ్యాచ్‌ల సీజన్ ఉంటుందని భావించి బిడ్ పెట్టగా, బీసీసీఐ మ్యాచ్‌ల సంఖ్యను 74కు తగ్గించింది. దీనిపై ఫీజు తగ్గించాలని సహారా కోరగా బీసీసీఐ అంగీకరించలేదు. ఈ వివాదం మరింత తీవ్రమై, బ్యాంక్ గ్యారంటీ అంశంలో సమస్యలు రావడంతో సహారా గ్రూప్ 2013లో జట్టును ఉపసంహరించుకుంది. పూణె వారియర్స్ జట్టు మైదానంలో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ, జట్టు సమన్వయం సరిగా కుదరలేదు.

Advertisement

వివరాలు 

తాత్కాలికంగా వచ్చిన జట్లు ఇవే..

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధానికి గురవడంతో 2016, 2017 సీజన్లలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు రంగప్రవేశం చేశాయి. ఇవి కేవలం రెండు సీజన్లకే పరిమితమయ్యాయి. సురేశ్ రైనా నాయకత్వంలో గుజరాత్ లయన్స్ 2016లో ప్లేఆఫ్స్‌కు చేరినా, 2017లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు 2016లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే 2017లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరి, ముంబయి ఇండియన్స్ చేతిలో ఒక్క పరుగుతో ఓడిపోయింది. 2018లో సీఎస్కే, రాజస్థాన్ తిరిగి రావడంతో ఈ రెండు జట్లు కూడా చరిత్రలో కలిసిపోయాయి.

వివరాలు 

పేర్లు మారినా ఫలితం మారలేదు

ఐపీఎల్‌లో కొన్ని జట్లు తమ బ్రాండ్‌ను మార్చుకునేందుకు పేర్లు మార్చుకున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పంజాబ్ కింగ్స్‌గా మారింది. అయితే పేర్లు మారినా ఫలితాలు మాత్రం మారలేదు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాయి. పేర్లలో మార్పు వచ్చినా, ట్రోఫీ మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. మొత్తానికి ఐపీఎల్‌లో జట్లు రావడం, వెళ్లిపోవడం సహజమే అయినప్పటికీ, డెక్కన్ చార్జర్స్ వంటి ఛాంపియన్ జట్టు కనుమరుగవడం అభిమానులను ఇప్పటికీ నిరాశకు గురిచేస్తోంది.

Advertisement