Shreyas Iyer: కోలుకుంటున్నా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు: శ్రేయస్ అయ్యర్
ఈ వార్తాకథనం ఏంటి
గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు. ప్రస్తుతం తాను క్రమంగా కోలుకుంటున్నానని, తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. "ప్రస్తుతం నేను కోలుకుంటున్న దశలో ఉన్నాను. ప్రతి రోజూ నా ఆరోగ్యం మెరుగుపడుతోంది. నాకు అండగా నిలిచి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మద్దతు నాకు ఎంతో విలువైనవి. నన్ను మీ ప్రార్థనల్లో గుర్తు పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు" అని అయ్యర్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.
వివరాలు
మెరుగైన చికిత్స కోసం ఐసీయూకి..
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో శ్రేయస్ అయ్యర్ తీవ్ర గాయానికి గురయ్యాడు. ఓ అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఆయన పక్కటెముకల దగ్గర గట్టిగా దెబ్బ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. తొలుత ఇది సాధారణ గాయమని భావించినా, స్కానింగ్ తర్వాత వైద్యులు ఆయన ప్లీహం (spleen) భాగంలో తీవ్రమైన గాయం ఉన్నట్లు నిర్ధారించారు. ఆ కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆయనను ఐసీయూకి మార్చారు. ఈ ఘటనపై బీసీసీఐ అక్టోబర్ 27, 28 తేదీల్లో ప్రకటనలు విడుదల చేసింది.
వివరాలు
సిడ్నీలో భారత వైద్య నిపుణుల పర్యవేక్షణలో అయ్యర్ చికిత్స
"అక్టోబర్ 25న ఫీల్డింగ్ చేస్తుండగా అయ్యర్ కడుపు భాగంలో గట్టి దెబ్బ తగలడంతో ప్లీహం దెబ్బతిని, అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని వెంటనే గుర్తించి రక్తస్రావాన్ని నియంత్రించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అక్టోబర్ 28న చేసిన తాజా స్కానింగ్లో ఆయన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినట్లు తేలింది" అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం సిడ్నీలో భారత వైద్య నిపుణుల పర్యవేక్షణలో అయ్యర్ చికిత్స పొందుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయ్యర్ స్వయంగా స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.