ODI World Cup: అఫ్గానిస్థాన్కు గుడ్న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్కు క్వాలిఫై!
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గానిస్థాన్ 2027 వన్డే ప్రపంచకప్లో చోటు ఖాయం చేసుకుంది. సోమవారం ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆ జట్టు ప్రతిష్ఠాత్మక టోర్నీకి అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ వరకు వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత పొందుతాయి. ఐర్లాండ్పై గెలుపుతో అఫ్గానిస్థాన్ ఎనిమిదో స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. తుది గడువు వరకు ఆ స్థానాన్ని కోల్పోయే అవకాశం లేకపోవడంతో ప్రపంచకప్లో ఆ జట్టు బెర్తు ఖరారైంది. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్.. మూడో వన్డేలో ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వివరాలు
నాలుగో వన్డే బుధవారం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటైంది.
అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3/29, రషీద్ ఖాన్ 3/44, యామిన్ అహ్మద్జాయ్ 2/35తో సత్తా చాటారు.
ఐర్లాండ్ బ్యాటర్లలో మార్క్ అడైర్ 36, కేడ్ కార్మికేల్ 32, జై ముంద్రా 31 పరుగులతో పోరాడటంతో ఆ జట్టు 200 పరుగుల మార్కును దాటగలిగింది.
206 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ కూడా ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఐర్లాండ్ బౌలర్ గవిన్ హోయ్ 4/34తో చెలరేగడంతో అఫ్గాన్ బ్యాటింగ్ తడబడింది.
అయితే రహ్మానుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేయడంతో అఫ్గానిస్థాన్ విజయానికి చేరువైంది.
వివరాలు
తొలి వన్డే వర్షం కారణంగా రద్దు
అతడికి రషీద్ ఖాన్ 37 పరుగులతో అజేయంగా నిలిచి సహకరించాడు.
దీంతో అఫ్గాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది.
ఇక నాలుగో వన్డే బుధవారం జరగనుంది. ఇప్పటికే సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉన్న అఫ్గానిస్థాన్.. మరో విజయంతో సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.