Page Loader
IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!
ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు మళ్లీ భారత్‌కు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 16న టోర్నీని తిరిగి ప్రారంభించి, మే 30న ఫైనల్ నిర్వహించాలన్న యత్నాల్లో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ నిలిపివేసిన వెంటనే మిచెల్ స్టార్క్ తన భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీకి వెళ్లిపోయాడు. అక్కడికి చేరుకున్న స్టార్క్ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, అతని మేనేజర్ మాట్లాడుతూ.. టోర్నీ తిరిగి ప్రారంభమైనా స్టార్క్ భారత్‌కు తిరిగి రావడం అనుమానాస్పదమేనని వ్యాఖ్యానించాడు.

Details

ఆసీస్ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు

ఇక, ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ పత్రిక ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ ఆటగాళ్లు ఐపీఎల్‌కు తిరిగి వెళ్లకపోయినా పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లపై కూడా సందేహాలు నెలకొన్నాయి. వీరి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయినందున, జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు సిద్ధమయ్యేందుకు స్వదేశంలోనే ఉండాలని ఈ ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Details

24 గంటల్లోనే భారత్ ను విడిచి వెళ్లిన ప్లేయర్లు

ఐపీఎల్ సస్పెన్షన్‌కు గడచిన 24 గంటల్లోనే అనేక మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భారత్‌ను విడిచి వెళ్లిపోయారు. వీరిని తిరిగి రప్పించడమే ఇప్పుడు ఆర్గనైజర్లకు అతిపెద్ద సవాలుగా మారింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇప్పటికే తమ దేశానికి చేరుకోగా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం మే 25 వరకు మంజూరు చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అనంతరం తమ ఆటగాళ్లను కొనసాగించాలా, వద్దా అనే విషయంలో చర్చించనుంది. ఆటగాళ్ల భద్రతే ప్రాధాన్యమని CSA స్పష్టంగా తెలిపింది.