LOADING...
Hardik pandya: రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ
రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ

Hardik pandya: రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోటీలో ముంబయి ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ పరాజయంపై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అలాగే జట్టు కూర్పు విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. "మా జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడం మాకు పెద్ద దెబ్బ అయ్యింది. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా ఎక్కువ పరుగులు ఇచ్చాము. ఈ రెండు విభాగాల్లో మేము తప్పకుండా మెరుగుపడాలి. గత రెండు మూడు మ్యాచ్‌లను పరిశీలించినా, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాం" అని పాండ్య వివరించాడు.

వివరాలు

అతడే జట్టుకు బలమైన ఆస్తి..

రాబోయే మ్యాచ్‌లలో జట్టులో మార్పులు ఉండే అవకాశాన్ని కూడా ఆయన సూచించాడు. "ప్రస్తుతం మా వద్ద ఉన్న ఎంపికలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లలో జట్టు కూర్పులో మార్పులు చేసే విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. ముఖ్యంగా పవర్‌ప్లే సమయంలో మరింతగా పరుగులు సాధించడం అవసరం. నిన్నటి మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్‌ చేసిన పోరాటం జట్టుకు చాలా ఉపయోగపడింది. అతను మా జట్టుకు ఒక బలమైన ఆస్తి" అని చెప్పాడు.

వివరాలు

రూథర్ ఫోర్డ్ అద్భుత ప్రదర్శన..

ఈ మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్‌ 31 బంతుల్లో 71 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించాడు. అందులో ఒక ఫోర్‌తో పాటు తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. అతని పోరాటం ఉన్నప్పటికీ, ముంబయి ఇండియన్స్‌కు విజయం అందలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 240 పరుగులు సాధించగా, లక్ష్య ఛేదనలో ముంబయి జట్టు 222 పరుగులకే పరిమితమైంది.

Advertisement