LOADING...
Jyoti Surekha: ఆర్చరీలో చారిత్రక నిర్ణయం.. టాప్స్‌లో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖ
ఆర్చరీలో చారిత్రక నిర్ణయం.. టాప్స్‌లో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖ

Jyoti Surekha: ఆర్చరీలో చారిత్రక నిర్ణయం.. టాప్స్‌లో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్‌)లో తాజాగా కాంపౌండ్ ఆర్చర్లను చేర్చడం భారత ఆర్చరీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖకు కొత్త ఉత్సాహాన్ని అందించనుంది. ఎన్నోఏళ్లుగా అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత్‌కు పతకాలు తెచ్చిపెడుతున్న జ్యోతి సురేఖకు ఈ నిర్ణయం కీలక మలుపుగా మారనుంది. భారత్ నుంచి ఒలింపిక్ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ 'టాప్స్‌' పథకం ద్వారా అథ్లెట్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. అయితే ఇప్పటివరకు ఒలింపిక్ క్రీడాంశాలకే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో, ఒలింపిక్స్‌లో లేని కాంపౌండ్ ఆర్చరీ కేటగిరీకి 'టాప్స్‌' వర్తించలేదు.

Details

179 మందికి 'టాప్స్‌' పథకం అమలు

దీనివల్ల ప్రపంచ స్థాయి ఆర్చరీ పోటీల్లో దేశానికి, రాష్ట్రానికి పతక ప్రతిష్టలు తెస్తున్న వెన్నం జ్యోతి సురేఖ, పర్‌నీత్ కౌర్, అభిషేక్ వర్మ వంటి కాంపౌండ్ ఆర్చర్లు ఈ పథకానికి దూరమయ్యారు. అయితే తాజాగా క్రీడామంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో, ఒలింపిక్ ఈవెంట్ కాకపోయినా ఎనిమిది మంది కాంపౌండ్ ఆర్చర్లకు 'టాప్స్‌' కింద లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉండగా, మరో తెలుగుతేజం రికర్వ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఇప్పటికే 'టాప్స్‌' పథకంలో కొనసాగుతున్నాడు. మరోవైపు డోపింగ్‌లో పట్టుబడిన మహిళా రెజ్లర్ రితిక హుడాను 'టాప్స్‌' నుంచి తొలగించారు. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా గతంలో 179 మందికి 'టాప్స్‌' పథకాన్ని అమలు చేశారు.

Details

గతేడాది ఈ సంఖ్య 94కి తగ్గింది

అయితే ప్రదర్శనలో వైఫల్యం, డోపింగ్ వంటి కారణాల వల్ల గతేడాది చివరి నాటికి ఈ సంఖ్య 94మందికి తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలోనే 'టాప్స్‌' కోర్ గ్రూప్ జాబితాను మళ్లీ విస్తరించి 118 మందికి పెంచారు. ఈ జాబితాలో 57 మంది అథ్లెట్లు ఉండగా, మరో 61 మంది పారాథ్లెట్లు ఉన్నారు. క్రీడాశాఖ ప్రత్యేక డెవలప్‌మెంట్ గ్రూప్‌లో అథ్లెట్లు అనిమేశ్ కుజుర్ (200 మీటర్ల పరుగు), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), 4×400మీటర్ల రిలే జట్టు సభ్యులు విశాల్, జయ్ కుమార్, రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్, సంతోష్ కుమార్‌లకు చోటు దక్కింది. ఈగ్రూప్‌లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మానుశ్ షా, మానవ్ ఠక్కర్, దియా చిటాలేలను కూడా ఎంపిక చేశారు.

Advertisement

Details

'టాగ్‌'లో కొత్తగా గోల్ఫ్, సర్ఫింగ్

టార్గెట్ ఆసియా క్రీడల గ్రూప్ (టీఏజీజీ-టాగ్‌) పరిధిలో కొత్తగా లబ్ధిపొందే క్రీడాంశాలను కూడా విస్తరించారు. 'టాప్స్‌'లో లేని గోల్ఫ్, సర్ఫింగ్, టెన్నిస్ క్రీడాకారులకు ఇకపై 'టాగ్‌' పథకం కింద సహాయం అందించనున్నారు. ఈ ఏడాది జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు సాధించాలనే లక్ష్యంతో గోల్ఫర్లు శుభాంకర్ శర్మ, దీక్ష డాగర్, టెన్నిస్ ప్లేయర్లు సుమిత్ నాగల్, యూకీ బాంబ్రీ, మాయ రాజేశ్వరన్ సహా మొత్తం 48 మందిని 'టాగ్‌' పథకం కింద ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే ఈక్వెస్ట్రియన్ క్రీడాకారులు ఫౌద్ మీర్జా, అనుశ్ అగర్‌వాలా, ఫెన్సర్ భవానీ దేవి, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ తదితరులు కొనసాగుతున్నారు.

Advertisement

Details

శిక్షణకు ముందు అనుమతులు తప్పనిసరి

'టాప్స్‌', 'టాగ్‌' పథకాల కింద ఎంపికైన అథ్లెట్లకు కోచింగ్, ఇతర అవసరాల కోసం నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. అవసరమైతే అదనంగా రూ. 25 వేల పాకెట్ అలవెన్స్ కూడా ఇస్తారు. అలాగే విదేశీ శిక్షణలో ఉన్న రోజులకు రోజుకు రూ. 2,250 (25 డాలర్లు) చొప్పున అదనపు భత్యం అందజేస్తారు. అయితే విదేశీ శిక్షణకు ముందుగా సంబంధిత అనుమతులు తప్పనిసరి.

Advertisement