Loading...
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు.. గంభీర్‌పై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్
వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు.. గంభీర్‌పై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్

Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు.. గంభీర్‌పై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్‌ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజు శాంసన్‌ (Sanju Samson) పట్ల జట్టు యాజమాన్యం వ్యవహరిస్తోన్న తీరును కూడా ఆయన ప్రశ్నించాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్‌ను పక్కన పెట్టి.. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో సంజుకు అవకాశం కల్పించారు. అయితే ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ కేవలం 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. ''అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు.

వివరాలు

నా భార్య కూడా ఆశ్చర్యపోయింది

దీంతో మేం మ్యాచ్‌ చూడటం ఆపేసి.. సినిమా చూడటం మొదలుపెట్టాం. సూర్యవంశీ ఎందుకు ఆడటం లేదని నా భార్య కూడా ఆశ్చర్యపోయింది.

గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారని ఆమె ప్రశ్నించింది.

టీమ్‌మేనేజ్‌మెంట్ సూర్యవంశీ పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు. తర్వాతి మ్యాచ్‌లో సూర్యవంశీ ఆడి.. పరుగులు చేయకపోతే తనను జట్టు నుంచి తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతాడు.

మీరు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ఆటగాళ్లందరి మనసుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నారు.

సూర్యవంశీ దులీప్ ట్రోఫీ, టీ20లు, ఇండియా-ఎ, ఐపీఎల్ వంటి అన్ని స్థాయుల్లోనూ పరుగులు సాధించాడు. మీరు అతడిని ప్రోత్సహించాలి'' అని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.

వివరాలు

టీమ్ మేనేజ్‌మెంట్ సంజుతో ఆడుకుంటోంది

సంజు శాంసన్‌ విషయంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలను కూడా క్రిస్ శ్రీకాంత్ తప్పుబట్టాడు.

సంజుకు తగినన్ని అవకాశాలు ఇవ్వకుండా.. వైభవ్ సూర్యవంశీని ఆడించాలనే ఉద్దేశంతో అతడిని తప్పించకూడదని సూచించాడు.

'టీమ్ మేనేజ్‌మెంట్ సంజు శాంసన్‌తో ఆడుకుంటోంది. అతడిని చూస్తే జాలేస్తోంది. వైభవ్‌ను ఆడించాలని అతడిని తప్పించకండి. శాంసన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. రాణించకపోతే అప్పుడు తప్పించండి.

వైభవ్‌ వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడేలా చూడండి. వీరిద్దరిలో ఎవరినీ స్థిరంగా తుది జట్టులో ఉంచకపోవడం భారత్ చేస్తోన్న పొరపాటు. ఇది ఏ ఆటగాడికైనా ఇబ్బందికరమే'' అని క్రిస్ శ్రీకాంత్ వివరించాడు.

ADVERTISEMENT