Page Loader
Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!
ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!

Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందుగా, భారత సీనియర్ జట్టుకు అవసరమైన సన్నాహకాలను అందించేందుకు భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. భారత్-ఎ జట్టు తొలి బృందం మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా, భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లను ఆడనుంది. మే 30న క్యాంటర్‌బరీ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుండగా, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్‌లు కీలకమవుతాయని అంచనా.

Details

జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసిన ఆటగాళ్ల వివరాలను బీసీసీఐ సేకరించి లాజిస్టిక్స్ ప్రక్రియ వేగవంతం చేసింది. ఐపీఎల్ నాకౌట్ దశకు చేరుకోని ఆటగాళ్లు ముందుగా మే 25న బయలుదేరే జట్టులో ఉంటారని, మిగిలిన వారు తమ ఐపీఎల్ బాధ్యతలు ముగిసిన తర్వాత జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ ఆడనున్న ప్రధాన జట్టు ఆటగాళ్లు జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌కు బదులుగా రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆడాలని అనుకుంటున్నారని సమాచారం.

Details

ముందుగా వెళ్లనున్న ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్

ఈ నిర్ణయం వారి ఐపీఎల్ ప్రదర్శన, మెడికల్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ముందుగా వెళ్లి అక్కడి 'ఎ' జట్టుతో మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్ సీజన్ తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి, కోలుకునే సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ వేసవిలో, భారత్-ఎ జట్టు, భారత అండర్-19 జట్టు, మహిళల జట్టు మరియు మిక్స్‌డ్ డిజేబిలిటీ జట్లు ఇంగ్లండ్‌లో పర్యటించనున్నాయి. భారత మహిళల జట్టు ఐదు టీ20లు మరియు మూడు వన్డేలు ఆడనుండగా, అండర్-19 జట్టు ఐదు వన్డేలు, రెండు టెస్టుల్లో పాల్గొంటుంది.