Page Loader
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
వన్డేలో 30 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 3-0తో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కి పంపారు. రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. హార్దిక్‌పాండ్యా (38 బంతుల్లో 54), కోహ్లీ 36, శార్దూల్ ఠాకూర్ 25, ఇషాన్ కిషన్ 17, సూర్యకుమార్ 14 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్ కాన్వే 100 బంతుల్లోనే 138 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో న్యూజిలాండ్ పరాజయం పాలైంది.

టీమిండియా

స్వదేశంలో వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం

టీమిండియా స్వదేశంలో వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మార్చి 2019లో ఇండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకూ ఇండియా, న్యూజిలాండ్ 116 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 58 మ్యాచ్‌లో నెగ్గింది. ముఖ్యంగా రోహిత్, గిల్ ఓపెనింగ్ జోడి అద్భుతంగా రాణించింది. మూడో వన్డేల్లో 25 ఓవర్లకు 200 పైగా పరుగులు సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. రోహిత్, గిల్ ఇప్పటివరకూ ఆరుసార్లు ఓపెనింగ్ చేయగా.. అందులో ఐదుసార్లు 50+ భాగస్వామ్యాలను నమోదు చేశారు. వన్డేల్లో రోహిత్ 30వ సెంచరీని నమోదు చేశాడు. శతకాల పరంగా రికీ పాంటింగ్‌ రికార్డును రోహిత్ సమం చేశాడు.