LOADING...
Women's T20 World Cup 2026: పదేళ్ల నిరీక్షణకు ఒక్క అడ్డంకి.. మరో ఘనత కోసం సిద్ధమైన హర్మన్ సేన!
పదేళ్ల నిరీక్షణకు ఒక్క అడ్డంకి.. మరో ఘనత కోసం సిద్ధమైన హర్మన్ సేన!

Women's T20 World Cup 2026: పదేళ్ల నిరీక్షణకు ఒక్క అడ్డంకి.. మరో ఘనత కోసం సిద్ధమైన హర్మన్ సేన!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 11, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచకప్‌లో అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించింది. ఇంగ్లండ్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు బరిలోకి దిగుతోంది. జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే కీలక పోరుతో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

వివరాలు

బ్యాటింగ్‌లో అపార బలం.. యువ ఆటగాళ్ల ఉత్సాహం

భారత జట్టుకు అతిపెద్ద బలంగా నిలుస్తున్నది బ్యాటింగ్ విభాగం. ఐదోసారి ప్రపంచకప్‌లో జట్టును నడిపిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ అనుభవం జట్టుకు అమూల్యమైన ఆస్తి. ఆమెతో పాటు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, దూకుడైన బ్యాటర్ షఫాలీ వర్మ, స్థిరత్వానికి ప్రతీకగా నిలిచే జెమిమా రోడ్రిగ్స్ ప్రత్యర్థి బౌలింగ్ దళాలకు సవాల్ విసరనున్నారు. ఇక మ్యాచ్ చివరి దశల్లో వేగంగా పరుగులు సాధించగల వికెట్‌కీపర్ రిచా ఘోష్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న భారతి ఫుల్మాలి, అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మిడిల్ ఆర్డర్‌కు బలాన్నిస్తారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు కూడా పెద్ద వేదికపై తమ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

ఇంగ్లాండ్‌లో స్పిన్ అస్త్రంపై భారత్ ఆశలు..

ఈ టోర్నీలో భారత స్పిన్ బౌలింగ్ విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల స్పిన్ త్రయం ఇంగ్లాండ్ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు కలిగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీరికి దీప్తి శర్మ అనుభవం జతకావడం జట్టుకు అదనపు బలంగా మారింది. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్ దాడిపై ఎక్కువగా ఆధారపడటం భారత్‌కు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

అనుభవం కొరత.. గాయాల ప్రభావం..

బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని అంశాలు భారత శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌లకు ఇది తొలి ప్రపంచకప్ కావడం గమనార్హం. అంతర్జాతీయ మెగా టోర్నీల్లో ఉండే ఒత్తిడిని ఎదుర్కోవడం వీరికి కీలక పరీక్షగా మారనుంది. మరోవైపు, వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ వెన్ను గాయంతో జట్టుకు దూరమవడం పెద్ద ఎదురుదెబ్బ. ఆమె స్థానాన్ని భర్తీ చేయాల్సిన కాశ్వి గౌతమ్ కూడా మోకాలి గాయంతో తప్పుకోవడంతో జట్టు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్ విభాగాల్లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. అదే ప్రస్తుతం భారత్ ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది.

Advertisement

వివరాలు

మరో ఐసీసీ టైటిల్‌కు సువర్ణావకాశం..

భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఎన్నోసార్లు ఐసీసీ ట్రోఫీలు చేజారిపోయాయి. అయితే గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా ఆ నిరీక్షణకు తెరపడింది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని హర్మన్‌ప్రీత్ సేన అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటే ప్రపంచ మహిళల క్రికెట్‌లో భారత్ మరో మైలురాయిని అందుకున్నట్లే అవుతుంది.

వివరాలు

భారత తుది జట్టు (అంచనా)..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్ లేదా రాధా యాదవ్.

Advertisement