Teamindia W : లారెస్ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్ జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో గొప్ప గౌరవానికి చేరువైంది. ప్రతిష్టాత్మకమైన 'లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్' లో టీమ్ కేటగిరీకి హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నామినేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో విశేష విజయాలు సాధించిన క్రీడాకారులు, జట్లకు ప్రతి ఏడాది లారెస్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తుంది. ఈసారి భారత మహిళల జట్టు కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకుంది.
వివరాలు
అంతర్జాతీయ అవార్డు రేసులో తొలి భారత జట్టు
ఒక భారత జట్టు అంతర్జాతీయ స్థాయి లారెస్ టీమ్ అవార్డు రేసులో నిలవడం ఇదే తొలిసారి. ఈ కేటగిరీలో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ఇంగ్లండ్ మహిళల ఫుట్బాల్ జట్టు, యూరోపియన్ రైడర్ కప్ టీమ్, ఫ్రెంచ్ ఫుట్బాల్ లీగ్ చాంపియన్ పారిస్ సెయింట్-జెర్మైన్, మెక్లారెన్ ఫార్ములా వన్ జట్లు కూడా పోటీలో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో లారెస్ టీమ్ అవార్డుకు నామినేట్ అయిన తొలి క్రికెట్ జట్టు భారతదేశమేనని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
వివరాలు
ప్రపంచకప్ విజయమే నామినేషన్కు కారణం
ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు చూపిన అద్భుత ప్రదర్శనే ఈ నామినేషన్కు కారణమైంది. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ చేరిన భారత్, అక్కడ దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తించి లారెస్ నిర్వాహకులు హర్మన్ప్రీత్ కౌర్ సేనను టీమ్ అవార్డుకు ఎంపిక చేశారు. మాడ్రిడ్లో అవార్డుల వేడుక ఈ ఏడాది లారెస్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 20న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరగనుంది. భారత మహిళల జట్టు ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.
వివరాలు
గతంలో వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులు
ఇప్పటివరకు భారతదేశం నుంచి వ్యక్తిగత విభాగాల్లో కొంతమంది క్రీడాకారులు మాత్రమే లారెస్ అవార్డులకు నామినేట్ అయ్యారు. మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 2019లో, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2022లో, క్రికెటర్ రిషభ్ పంత్ 2025లో ఈ అవార్డుల కోసం నామినేట్ అయ్యారు. ఇప్పుడు తొలిసారి ఒక భారత జట్టు లారెస్ టీమ్ అవార్డు రేసులో నిలవడం భారత క్రీడలకు ప్రత్యేక గౌరవంగా నిలిచింది.