IPL 2026 RR vs GT: దుమ్ములేపిన ధృవ్ జురెల్.. అద్భుత అర్ధశతకం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్లలో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ కూడా ఫీల్డింగ్నే ఎంచుకున్న నేపథ్యంలో, మొదటిసారి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్గా రియాన్ పరాగ్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
వివరాలు
శక్తివంతమైన ఆరంభం…
కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్లుగా వైభవ్ సూర్యవంశీ , యశస్వి జైస్వాల్ జట్టు కోసం అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. ఈ జంట కేవలం 6.2 ఓవర్లలోనే 70 పరుగులు జోడించింది. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో కొనసాగుతూ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కగిసో రబాడా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ క్రీజ్లోకి వచ్చి తొలి బంతికే సిక్సర్ బాదినా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు.
వివరాలు
ధృవ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్
సిమ్రాన్ హెట్మయర్ అశోక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. డినోవాన్ ఫెర్రారియా మాత్రం కేవలం 1 పరుగు చేసి కగిసో రబాడా బౌలింగ్లో వెనుదిరిగాడు. వన్డౌన్లో క్రీజ్లోకి వచ్చిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీ సాధించాడు. అతడు 42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 75 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. చివరి బంతికి రవీంద్ర జడేజా ఫోర్ బాదడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 210కి చేరింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఒక వికెట్ సాధించారు.