Ipl 2026 : అయ్యో ఎంత పనయ్యింది.. ఇక ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజేనా?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక పెద్ద వేదికగా నిలుస్తుంది. ఇందులో పోటీ ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది. ఇక్కడ నిలబడాలంటే ప్రతిభను నిరూపించుకోవడం తప్పనిసరి. అయితే, కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేక, తుది జట్టులో కూడా అవకాశాలు కోల్పోతున్న ముగ్గురు భారత ఆటగాళ్లకు 2026 సీజన్ తర్వాత ఐపీఎల్ ప్రయాణం ముగిసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం.
వివరాలు
మనీష్ పాండే పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మనీష్ పాండే ఐపీఎల్లో తన కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. 2026 సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 75 లక్షల రూపాయలకు జట్టులో ఉంచుకున్నప్పటికీ, మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం 36 ఏళ్ల వయస్సులో ఉన్న ఇతను తన ఫామ్ను తిరిగి అందుకోలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్ నాటికి అతనికి 37 ఏళ్లు పూర్తవుతాయి. యువ ఆటగాళ్ల పెరుగుదల నేపథ్యంలో 2027 వేలంలో అతనిపై ఏ జట్టు ఆసక్తి చూపకపోవచ్చు. ఇప్పటివరకు 174 మ్యాచ్లు ఆడిన పాండే, 29.42 సగటుతో 3942 పరుగులు చేశాడు. ఇందులో అతని గరిష్ఠ స్కోరు 114 కాగా, ఒక శతకం, 22 అర్ధశతకాలు ఉన్నాయి.
వివరాలు
ఇషాంత్ శర్మకు అవకాశం లేదుగా..
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్కు 75 లక్షల రూపాయలకు రిటైన్ చేసుకుంది. అయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా అతనికి అవకాశం రాలేదు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ వంటి పేసర్లను జట్టు ప్రాధాన్యంగా తీసుకుంటుండటంతో, 37 ఏళ్ల ఇషాంత్కు చోటు దక్కడం కష్టమైంది. వచ్చే ఏడాది అతని వయస్సు 38 దాటనుంది. ఈ పరిస్థితుల్లో రాబోయే వేలంలో అతనిపై జట్లు ఆసక్తి చూపే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తన కెరీర్లో 117 మ్యాచ్లు ఆడిన ఇషాంత్, మొత్తం 96 వికెట్లు సాధించాడు.
వివరాలు
నిలకడ లేని అజింక్య రహానే ..
జాతీయజట్టులో స్థానం కోల్పోయిన అజింక్య రహానే, ఇప్పుడు ఐపీఎల్లో కష్టాలను ఎదుర్కొంటున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 1.5 కోట్ల రూపాయలకు జట్టులోకి తీసుకుంది. 2025 నుంచి జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, బ్యాటింగ్లో మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాడు. 2026 సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన రహానే 67, 8, 8, 41, 28, 0 స్కోర్లతో మొత్తం 152 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనను బట్టి వచ్చే వేలంలో అతనిపై జట్లు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. తన ఐపీఎల్ కెరీర్లో 204 మ్యాచ్లు ఆడిన రహానే, 30.49 సగటుతో 5184 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 105 కాగా, 2 శతకాలు, 34 అర్ధశతకాలు నమోదు చేశాడు.