IPL: ఎన్నికల ప్రకటనల తర్వాతే.. ఐపీఎల్ 19: రాజీవ్ శుక్లా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ రూపకల్పనపై బీసీసీఐ కసరత్తులు కొనసాగిస్తోంది. మార్చి 26 నుంచి మే 31 వరకు ఈ సీజన్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
వివరాలు
ఎన్నికల నేపథ్యంలో ఎదురుచూపులు
ఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో,ప్రభుత్వం ఎన్నికల తేదీలను ఖరారు చేసిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ను తుది రూపం ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. అందుకే అధికారిక ప్రకటన కోసం బోర్డు ఎదురుచూస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న కారణంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతోందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ హోం గ్రౌండ్లను ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
త్వరలో షెడ్యూల్ ప్రకటన
'ఐపీఎల్ షెడ్యూల్ తయారీ పనులు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తాం. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా మ్యాచ్లను నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తాం. బెంగళూరు, రాజస్థాన్ జట్లకు తమ హోం గ్రౌండ్ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరగా ఆ వివరాలు అందిస్తే, వాటికి అనుగుణంగా మ్యాచ్లను షెడ్యూల్ చేస్తాం' అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.