IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా తమ బౌలింగ్తో బ్యాటర్లను భయపెట్టే అగ్రశ్రేణి బౌలర్లు కూడా ఈ సీజన్లో ఇంకా వికెట్ల ఖాతాను తెరవలేకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా యార్కర్లలో నిపుణుడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు మ్యాచ్ల్లో వికెట్ సాధించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాలు
బుమ్రా యార్కర్ల ప్రభావం తగ్గిందా?
డెత్ ఓవర్లలో ప్రపంచ స్థాయి బౌలర్గా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా, ఈ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. కోల్కతాతో జరిగిన తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చినా వికెట్ సాధించలేదు. తరువాత ఢిల్లీపై కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి నియంత్రణతో బౌలింగ్ చేసినా, వికెట్ మాత్రం దక్కలేదు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మళ్లీ ఖాళీ చేతులతోనే మిగిలిపోయాడు. బుమ్రా లాంటి బౌలర్ 11 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా సాధించకపోవడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.
వివరాలు
జట్టుకు భారంగా బౌలర్లు..
బుమ్రాకు తోడుగా రాణిస్తాడని భావించిన ట్రెంట్ బోల్ట్ కూడా ముంబై ఇండియన్స్ తరపున ఇంకా వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. పవర్ప్లేలో వికెట్లు సాధించడంలో నిపుణుడైన బోల్ట్ ఈసారి విఫలమవుతుండటం జట్టుకు సమస్యగా మారింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కూడా ఆశించిన స్థాయిలో వికెట్లు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ అధిక పరుగులు ఇచ్చి జట్టుకు భారంగా మారుతున్నాడు.
వివరాలు
ఫామ్లో లేని స్టార్లు..
సన్రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన హర్షల్ పటేల్, పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ కూడా వికెట్ల కోసం కష్టపడుతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రభావం కూడా ఈ సీజన్లో కనిపించడం లేదు. ఈ బౌలర్లందరూ ఎకానమీ పరంగా ఓకే అనిపించినా, కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పడంలో విఫలమవుతున్నారు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతుండటం బౌలర్లకు పెద్ద సవాల్గా మారింది.
వివరాలు
నిపుణుల హెచ్చరిక..
ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ ప్రారంభ పది రోజుల్లోనే 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఒకవైపు బుమ్రా, బోల్ట్ వంటి అనుభవజ్ఞులు వికెట్లు సాధించలేకపోతుండగా, మరోవైపు వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వీరి బౌలింగ్పై దాడి చేస్తున్నారు. బౌలర్లు తమ వ్యూహాలను మార్చుకోకపోతే, ఈ సీజన్ వారి కెరీర్లో అత్యంత నిరాశాజనకంగా మిగిలే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.