Page Loader
Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం
ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం

Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో మార్పులకు దిగిన ముంబయి ఇండియన్స్‌ జట్టు, తాజా పరిణామాల్లో ముగ్గురు కొత్త ఆటగాళ్లను తమ జట్టులోకి చేర్చుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, రిచర్డ్‌ గ్లీసన్‌, శ్రీలంక ఆటగాడు చరిత్‌ అసలంకతో ముంబయి జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ లీగ్‌ ఒక వారం పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ తిరిగి పునఃప్రారంభమైన తర్వాత ముంబయి జట్టులో ఉన్న విల్‌ జాక్స్, రికెల్‌టన్, కార్బిన్‌ బోష్‌ తిరిగి జట్టుతో కలవలేదు.

Details

5.25 కోట్లకు బెయిర్‌స్టో తో ఒప్పందం

వారి గైర్హాజరీతో జట్టు వారిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విల్‌ జాక్స్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సి ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లైన రికెల్‌టన్, కార్బిన్‌ బోష్‌లు ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం తమ దేశ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో వీరు ఐపీఎల్‌కు అందుబాటులో లేరు. బెయిర్‌స్టో గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడగా, 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలాడు. కానీ తాజాగా ముంబయి ఇండియన్స్‌ అతనితో రూ. 5.25 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం పోటీపడుతున్న ముంబయి జట్టుకు బెయిర్‌స్టో కీలకంగా మారే అవకాశం ఉంది.

Details

చరత్ అసలంకకు తొలి అవకాశం

అదే విధంగా గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఉన్న పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ను ముంబయి రూ. 1 కోట్లకు తీసుకుంది. చరిత్‌ అసలంకకు ఇది తొలి ఐపీఎల్‌ అవకాశం కాగా, అతడిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటికే తమ ప్లేఆఫ్స్‌ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ముంబయి ఇండియన్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మే 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 26న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, ముంబయికి ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయమవుతుంది.