
IND vs ENG: డ్రా చేసుకుందాం.. బెన్ స్టోక్స్కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవీంద్ర జడేజా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివర్లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి భారత్ను గట్టెక్కించారు. అయితే మ్యాచ్ చివర్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుందర్, జడేజా సెంచరీలకు దూసుకెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ డ్రా చేసుకుందాం అంటూ షేక్ హ్యాండ్ ప్రతిపాదన చేశాడు. దీంతో మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా వారిద్దరిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, భారత ఆటగాళ్లు ఆ ప్రతిపాదనను తేలికగా తిరస్కరించేశారు. దాంతో బెన్ స్టోక్స్ అసహనం వ్యక్తం చేస్తూ బ్రూక్,డకెట్ బౌలింగ్లో సెంచరీ చేద్దామనుకుంటున్నావా?అని జడేజాను వ్యంగ్యంగా ప్రశ్నించాడు.
Details
ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం
జడ్డూ కూడా తానెవరో చూపిస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. చివరికి ఇద్దరూ అజేయ శతకాలతో మ్యాచ్ను ముగించి ఇంగ్లండ్కు ఘాటు సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై క్రీడా విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం" అంటూ ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. బ్రూక్, జో రూట్ వంటివారు బంతిని బలవంతంగా ఫుల్టాస్లు వేస్తూ, వీలైనంత త్వరగా సెంచరీ చేయాలనే విధంగా బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇటు సుందర్, జడేజా లాంటి ఆటగాళ్లు చివరి వరకూ క్రీజులో నిలిచిన విధానం, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఒత్తిడికి లోనుకాకుండా అజేయ శతకాలు సాధించిన తీరు నెటిజన్లు, క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.