LOADING...
MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు కారణం ఇదేనా?
గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు కారణం ఇదేనా?

MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు కారణం ఇదేనా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఎంఎస్ ధోనీ కనిపించకపోవడంతో చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 26న జరిగిన ఆ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని మైదానంలోకి దిగుతాడని అందరూ ఎదురుచూశారు. అయితే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆయన ఆడకపోవడంతో పాటు డగౌట్‌లో కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో ధోనీ అసలు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడా? అనే సందేహాలు అభిమానుల్లో పెరిగాయి. ఈ నేపథ్యంలో చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు.

వివరాలు

నెలరోజులు గడిచినా కోలుకోని ధోనీ..

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ధోనీ పిక్క కండరానికి గాయపడినట్లు సమాచారం. మొదట ఈ గాయం రెండు వారాల్లో తగ్గుతుందని జట్టు యాజమాన్యం భావించింది. కానీ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా ఆయన ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయారు. ఇదే సమయంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అలాంటి సమయంలో ధోనీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారింది.

వివరాలు

జట్టుకు దూరంగా ఉంచుతున్న యాజమాన్యం..

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనీ గాయం గురించి వివరించారు. పిక్క కండర గాయం పూర్తిగా తగ్గకముందే ఆడితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని చెప్పారు. తొందరపడి మైదానంలోకి దిగితే మళ్లీ గాయం తిరగబడి, మొత్తం సీజన్‌కే దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ధోనీ ఫిజియోల పర్యవేక్షణలో కఠినంగా శ్రమిస్తున్నాడని, కానీ ఆయన తిరిగి ఆడే తేదీపై ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ప్రస్తుతం ధోనీ జట్టుతో పాటు ప్రయాణిస్తున్నాడు. నెట్స్‌లో కూడా అప్పుడప్పుడు సాధన చేస్తున్నాడు. అయితే మ్యాచ్‌లకు అవసరమైన పూర్తి స్థాయి ఫిట్‌నెస్ ఇంకా అందుకోకపోవడంతో యాజమాన్యం ఆయనను జట్టుకు దూరంగా ఉంచుతోంది.

Advertisement

వివరాలు

అంతవరకూ ఎదురుచూడాల్సిందేనా?

వయస్సు పెరిగిన కారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ధోనీ లేకపోవడం వల్ల చెన్నై బ్యాటింగ్ విభాగంలోనూ, వికెట్ల వెనుకనూ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్లెమింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ధోనీ మరో రెండు లేదా మూడు మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండే అవకాశముంది. వైద్యులు, ఫిజియోలు పూర్తి ఫిట్‌నెస్‌పై క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఆయన మైదానంలోకి అడుగుపెడతాడు. లీగ్ దశ ముగిసేలోపు ధోనీ కొన్ని మ్యాచ్‌లు ఆడి, ప్లేఆఫ్స్ సమయానికి జట్టును బలోపేతం చేస్తాడని చెన్నై యాజమాన్యం ఆశిస్తోంది. అప్పటివరకు అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement