LOADING...
Mumbai Indians: టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు
టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు

Mumbai Indians: టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ పోటీల్లో ముంబై జట్టు ఒకే మ్యాచ్‌లో అరుదైన ఘనతను అందుకుంటూనే తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. చెన్నైతో జరిగిన పోటీలో ఓటమి పాలైనప్పటికీ, టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన తొలి జట్టుగా ముంబై ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 286వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించినా, మ్యాచ్ ఫలితం ముందు ఆ ఆనందం క్షీణించింది. చెపాక్ మైదానం వేదికగా జరిగిన ఈ పోటీలో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది.

వివరాలు 

ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్లో ఈ ఘనత

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించి విజయాన్ని ఖాయం చేసింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగులతో అజేయంగా నిలవగా, కార్తీక్ శర్మ 54 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు 50 వేల పరుగుల మైలురాయికి చేరేందుకు ఇంకా 114 పరుగులు అవసరమయ్యాయి. తమ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్లో ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ ముగిసేసరికి జట్టు మొత్తం పరుగులు 50,003కు చేరాయి. అయితే, బ్యాటింగ్‌లో నమన్ ధీర్ 57 పరుగులతో పోరాడినా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులకే పరిమితమయ్యాడు.

వివరాలు 

ఓటమితో ముంబై ప్లేఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు

మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో చెన్నై జట్టు ఈ సీజన్‌లో ముంబైపై రెండోసారి గెలిచినట్లు అయింది. మరోవైపు, ఈ ఓటమితో ముంబై జట్టు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే కనిపిస్తున్నాయి. ఇక టీ20ల్లో 50 వేల పరుగులు సాధించిన జట్లలో ముంబై తరువాత స్థానంలో ఇంగ్లాండ్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ ఉంది. ఈ జట్టు 303 మ్యాచ్‌లలో 48,244 పరుగులు చేసింది. అలాగే ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు 295 మ్యాచ్‌లలో 47,304 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది.

Advertisement