
Suryakumar: డ్రెస్సింగ్ రూమ్ సహచరులే నా నిజమైన ట్రోఫీలు : సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ చరిత్రలో తొలిసారి భారత్-పాకిస్థాన్ (India vs Pakistan Final) ఫైనల్లో తలపడింది. ఒకే టోర్నమెంట్లో మూడుసార్లు ప్రత్యర్థిని ఓడించి భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగే ట్రోఫీ ప్రెజెంటేషన్, మెడల్స్ ప్రదానోత్సవం సుమారు గంటరన్నర ఆలస్యమైంది. చివరికి భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో పాటు మెడల్స్ను స్వీకరించలేదు. కారణం ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ. కేవలం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను మాత్రమే వేరే అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అభిషేక్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడాడు.
Details
మ్యాచ్ ఫీజును ఆర్మీకి ప్రకటిస్తున్నా
తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఛాంపియన్ జట్టు ట్రోఫీని అందుకోని సందర్భం చూడలేదు. ఇది మొదటిసారే అనుకుంటున్నా. మేము చాలా కష్టపడి సాధించాం. కానీ నా నిజమైన ట్రోఫీలు డ్రెస్రూమ్లో ఉన్నాయి. అవే - నా 14 మంది సహచర ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్. విజయం తర్వాత సంబరాలు చేసుకోవడానికి మేము గంటరన్నర వేచి చూశాం. ఆపై ఛాంపియన్ బ్యానర్ తీసుకురావడంలో కూడా ఆలస్యం జరిగింది. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవద్దని మాకు ఎవరూ చెప్పలేదు. మైదానంలో మేమే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఒక విషయం ఇక్కడ ప్రకటించాలనుకుంటున్నా- ఆసియా కప్లో ఇప్పటివరకు నాకు వచ్చిన మ్యాచ్ ఫీజును నేను భారత ఆర్మీకి విరాళంగా ఇస్తానని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.
Details
ట్రోఫీ లేకపోయినా సంబరాలు!
భారత్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ (Asia Cup)ను స్వీకరించకపోవడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. అయినా సోషల్ మీడియాలో మాత్రం సంబరాలు ఆగలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శుభ్మన్ గిల్ ఆసియా కప్ ట్రోఫీతో ఫొటోలను తమ ఖాతాల్లో షేర్ చేశారు. కానీ అవి ఒరిజినల్ ఫొటోలు కాకుండా టెక్నాలజీ సాయంతో ట్రోఫీని యాడ్ చేసిన చిత్రాలు కావడం విశేషం. సూర్య ఆ ఫొటోకు - ' మ్యాచ్ ముగిసిన తర్వాత గుర్తుండేది ఛాంపియన్లే, ట్రోఫీ ఫొటో కాదని క్యాప్షన్ పెట్టాడు. హార్దిక్ పాండ్య '3-0' అంటూ తన ఫొటోను షేర్ చేశాడు.