Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
ఈ వార్తాకథనం ఏంటి
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక అడుగు వేశాడు. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భాగంగా భారత్తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు. చిన్నతనం నుంచే క్రికెట్పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు.
వివరాలు
స్వగ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందం
2022లో కేవలం 18 ఏళ్ల వయసులోనే యుఎస్ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సాయితేజ, ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ పోటీల్లో అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్తో తలపడుతూ అమెరికా జట్టులో ఆడిన ఆయన ప్రదర్శనపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున ప్రపంచకప్ వేదికపై ఆడుతుండటంపై స్వగ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.