LOADING...
T20 World Cup 2026 schedule: స్కాట్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్
టీ20 ప్రపంచకప్‌కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్

T20 World Cup 2026 schedule: స్కాట్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌ వంటి బలమైన జట్టుపై గెలుపు అంచుల వరకు వెళ్లి చివర్లో చేజార్చుకున్న నేపాల్‌... టీ20 ప్రపంచకప్‌ను మాత్రం అద్భుతమైన విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని సూపర్‌-8 అవకాశాలు కోల్పోయిన నేపాల్‌, మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న దీపేంద్ర సింగ్‌ ఐరీ 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

వివరాలు 

నేపాల్ జట్టుకు బలమైన ఆరంభం

అతనికి తోడు కుశాల్‌ బుర్తెల్‌ 35 బంతుల్లో 43 పరుగులు (1 ఫోర్‌, 4 సిక్సర్లు), ఆసిఫ్‌ షేక్‌ 27 బంతుల్లో 33 పరుగులు (2 సిక్సర్లు), గుల్షన్‌ ఝా 17 బంతుల్లో 24 పరుగులు (1 ఫోర్‌, 2 సిక్సర్లు) చేసి తమ సత్తా చాటారు. ఫలితంగా 171 పరుగుల లక్ష్యాన్ని నేపాల్‌ 19.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బుర్తెల్‌, ఆసిఫ్‌ తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చారు. అయితే మైకేల్‌ లియాస్క్‌ (3/30) వరుసగా వికెట్లు తీస్తూ దూకుడు చూపడంతో 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన నేపాల్‌ 98/3 వద్ద ఒత్తిడిలో పడింది.

వివరాలు 

ఇటలీపై గెలిచిన స్కాట్లాండ్

ఆ సమయంలో ఐరీ, ఝా బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ మైకేల్‌ జోన్స్‌ 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మన్సీ (27), మెక్‌ములన్‌ (25)లతో జోన్స్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఒక దశలో స్కాట్లాండ్‌ 133/2తో బలమైన స్థితిలో కనిపించింది. కానీ చివర్లో సోంపాల్‌ కామి (3/25), నందన్‌ యాదవ్‌ (2/34)లు గట్టిగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టు తడబడింది. దీంతో ఆశించిన స్థాయికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ ఇటలీపై మాత్రమే గెలిచింది.

Advertisement

వివరాలు 

తమ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌కూ పెద్ద సంఖ్యలో హాజరైన నేపాల్ అభిమానులు 

నేపాల్‌ 2014లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొని అప్పుడు అఫ్గానిస్థాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించింది. ఆ తర్వాత 2024 టోర్నీకి మళ్లీ అర్హత సాధించినప్పటికీ,ఈసారి తొలి మ్యాచ్‌ల్లో ఖాతా తెరవలేకపోయింది. అయినా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్‌ 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గట్టిగా పోరాడి చివరికి 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత్‌లో నివసిస్తున్న నేపాలీ అభిమానులు ఈ ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌కూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం వాంఖడే స్టేడియాన్ని 19 వేల మందికి పైగా అభిమానులు నిండుగా నింపారు. నేపాల్‌ విజయం సాధించగానే వారి ఆనందోత్సాహాలు హద్దులు దాటాయి.

Advertisement