FIFA World Cup: అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశాలు.. ఇరాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఇరాన్, న్యూజిలాండ్ జట్లు 2-2తో డ్రా అయ్యాయి. అయితే మ్యాచ్ ఫలితంకంటే అనంతరం చోటుచేసుకున్న పరిణామాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికాను వీడి వెళ్లాలని తమకు ఆదేశాలు వచ్చాయని ఇరాన్ జట్టు ప్రధాన కోచ్ అమీర్ ఘలేనోయి వెల్లడించారు. ప్రపంచకప్లో తమ జట్టే అత్యంత అణచివేతకు గురవుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం విశ్రాంతి కోసం కాలిఫోర్నియాలో రాత్రి బస చేయాలని ఇరాన్ జట్టు భావించినప్పటికీ, వెంటనే మెక్సికోలోని తమ శిబిరానికి తిరిగి వెళ్లాలని సూచనలు అందినట్లు కోచ్ తెలిపారు.
వివరాలు
జూన్ 22న బెల్జియంతో ఢీ
అయితే అనుకున్న సమయానికి ముందుగానే అమెరికాను విడిచి వెళ్లాలని ఆదేశించిన వారు ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆసక్తికరంగా, ఇరాన్ తన తదుపరి మ్యాచ్ను కూడా లాస్ ఏంజెలెస్లోనే ఆడాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం జూన్ 22న బెల్జియంతో ఇరాన్ తలపడనుంది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధ చర్యలు ప్రారంభించిన తర్వాత ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను అమెరికా వెలుపల నిర్వహించాలని ఇరాన్ చేసిన అభ్యర్థనను ఫిఫా తిరస్కరించినప్పటికీ, చివరకు టోర్నీలో కొనసాగాలని ఆ దేశం నిర్ణయించింది.
వివరాలు
మ్యాచ్ ముగిసి వెంటనే బయలుదేరాలని ఆదేశాలు
ఈ నేపథ్యంలో అమీర్ ఘలేనోయి మాట్లాడుతూ, ''మ్యాచ్ ముగిసిన వెంటనే మీరు బయలుదేరాలని మాకు చెప్పారు. సాధారణంగా మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి చాలా అవసరం. కానీ మమ్మల్ని వెంటనే విమానం ఎక్కించి మెక్సికోలోని టిజువానాలో ఉన్న మా శిబిరానికి తిరిగి వెళ్లమంటున్నారు. దీనివల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. నిజం చెప్పాలంటే మమ్మల్ని ఎందుకు వెనక్కి పంపిస్తున్నారో మాకు తెలియడం లేదు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాకు సంబంధించిన ప్రణాళికలను వేరే వ్యక్తులు రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది.
వివరాలు
ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు
జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఎక్కడో వేరే చోట తీసుకుంటున్నట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ, ''వాస్తవానికి మేము మ్యాచ్కు రెండు రోజుల ముందే ఇక్కడికి రావాల్సి ఉంది. అలాగే ఈ రాత్రి ఇక్కడే బస చేసి, మరుసటి రోజు మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి ప్రయాణించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ప్రపంచకప్లో అత్యంత అణచివేతకు గురవుతున్న జట్టు మాదేనని నేను భావిస్తున్నానని కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
ఆటగాళ్లపై అదనపు భారం పడే అవకాశం
మరోవైపు, అమెరికా వీసాలు నిరాకరించడంతో ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచింగ్ సహాయక సిబ్బంది, మీడియా ప్రతినిధులు వంటి కీలక వ్యక్తులు జట్టుతో కలిసి ప్రయాణించలేకపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తరేమీతో పాటు కోచ్ అమీర్ ఘలేనోయి కూడా తీవ్రంగా తప్పుబట్టారు. జట్టుకు సంబంధించిన ముఖ్య సభ్యులు అందుబాటులో లేకపోవడం తమ సన్నద్ధతను మరింత క్లిష్టతరం చేసిందని, ఇది ఆటగాళ్లపై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు.