Fatima Sana: 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. పాక్ కెప్టెన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఫాతిమా సనా మహిళల టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఆమె కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిచా ఘోష్, సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ఫీల్డ్ రికార్డులను అధిగమించింది. ఇప్పటికే దేశీయ క్రికెట్లో 2022లో వార్విక్షైర్ తరఫున మేరీ కెల్లీ, 2025 సూపర్ స్మాష్ టోర్నీలో ఒటాగో జట్టు తరఫున లారా హారిస్ కూడా 15 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ మహిళల టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు ఫాతిమా సనా అగ్రస్థానంలో నిలిచింది.
వివరాలు
ఆరంభం నుంచే దూకుడు..
పాకిస్థాన్ తరఫున ఈ రికార్డు గతంలో నిడా ధర్ పేరిట ఉండేది. ఆమె 2019లో దక్షిణాఫ్రికాపై 20 బంతుల్లో అర్ధశతకం సాధించి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ రికార్డును ఫాతిమా అధిగమించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన ఫాతిమా సనా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
వివరాలు
టీ20లో అద్భుత రికార్డు..
కుడ్జాయ్ చిగోరా వేసిన 18వ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన ఆమె, నోమ్వేలో సిబాండా వేసిన 19వ ఓవర్లో 4, 4, 6, 6, 4తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే జట్టు కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఫాతిమా సనా 19 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనకు గాను ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్థాన్ జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది.