Page Loader
RCB vs PBKS: సచిన్‌ రికార్డును బద్దలుకొట్టిన RCB కెప్టెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాటర్‌గా
ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాటర్‌గా RCB కెప్టెన్‌..

RCB vs PBKS: సచిన్‌ రికార్డును బద్దలుకొట్టిన RCB కెప్టెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాటర్‌గా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు నాయకుడు రజత్‌ పాటిదార్‌ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్నరికార్డును చెరిపేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యల్ప ఇన్నింగ్స్‌ల్లోనే అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మార్కును అందుకున్న భారత రెండో ఆటగాడిగా పాటిదార్‌ గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం బెంగళూరులో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పాటిదార్‌ సాధించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది.

వివరాలు 

ఓపెనర్ల విఫలం.. పాటిదార్‌ అదుర్స్ 

ఆర్సీబీ తరఫున ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (4), విరాట్‌ కోహ్లి (1) నిరాశపరిచారు. కానీ మూడో స్థానంలో వచ్చిన పాటిదార్‌ 18 బంతుల్లో 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అతని ఇన్నింగ్స్‌ జట్టుకు ఓ మోస్తరు స్కోరు దిశగా నడిపించడంలో సహాయపడింది. టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ - 95 పరుగుల ముగింపు ఇన్నింగ్స్‌ చివర్లో టిమ్‌ డేవిడ్‌ 26 బంతుల్లో అజేయంగా 50 పరుగులు బాదడంతో ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, మార్కో యాన్సన్‌, యజువేంద్ర చహల్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో రెండు వికెట్లు తీశారు. జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఖాతాలో ఒక్క వికెట్‌ చేరింది.

వివరాలు 

పాటిదార్‌కు వెయ్యి పరుగుల ఘనత 

అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్‌ వధేరా 19 బంతుల్లో 33 పరుగులు చేసి విజయం వైపు జట్టును నడిపించాడు. చివరకు పంజాబ్‌ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన పాటిదార్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇంతకు ముందు సచిన్‌ టెండుల్కర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు 31 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల మార్కును అధిగమించిన తక్కువ ఇన్నింగ్స్‌ల భారత ఆటగాళ్లుగా నిలిచారు. పాటిదార్‌ వీరి రికార్డును ఒక ఇన్నింగ్స్‌ తక్కువలోనే బద్దలుకొట్టాడు.

వివరాలు 

సుదర్శన్‌ రికార్డు 

అయితే గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం 25 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు చేసి, భారత్‌ తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన ఆటగాడిగా ఉన్నాడు. ఇన్నింగ్స్‌ల పరంగా సుదర్శన్‌ కంటే పాటిదార్‌ వెనుకబడ్డాడు కానీ, అతడి సగటు, స్ట్రైక్‌రేటు మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాయి. ఐపీఎల్‌లో 35కు పైగా బ్యాటింగ్‌ సగటుతో, 150కుపైగా స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా పాటిదార్‌ చరిత్రలో నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో అతని స్థిరతను ఇది స్పష్టంగా చూపిస్తోంది.