Loading...
Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ఆయుష్‌ అదరహో
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ఆయుష్‌ అదరహో

Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ఆయుష్‌ అదరహో

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. టాప్‌ సీడ్‌, టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చైనా స్టార్‌ షి యుకికి భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి ఊహించని షాక్‌ ఇచ్చాడు. అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ నంబర్‌వన్‌ను కంగుతినిపించాడు. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఆరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు కూడా విజయంతో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట కూడా తొలి రౌండ్‌ను అధిగమించింది.

వివరాలు

ప్రపంచ నంబర్‌వన్‌కు ఆయుష్‌ షాక్

భారత్‌ ఆతిథ్యమిస్తున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి అదిరే ఆరంభం అందించాడు.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అన్‌సీడెడ్‌ ఆయుష్‌ 21-14, 13-21, 21-19తో టాప్‌ సీడ్‌ షి యుకిపై విజయం సాధించాడు.

తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న 21 ఏళ్ల ఆయుష్‌.. ప్రపంచ నంబర్‌వన్‌ ప్రత్యర్థిపై ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు.

గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కోర్టులో వేగంగా కదులుతూ మెరుపు స్మాష్‌లతో వరుస పాయింట్లు సాధించాడు.

తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచిన ఆయుష్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

వివరాలు

మూడో గేమ్‌పై ఉత్కంఠ

రెండో గేమ్‌లో షి యుకి తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయుష్‌ చేసిన తప్పులను సద్వినియోగం చేసుకుంటూ గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు.

దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. మూడో గేమ్‌లో ఆయుష్‌ మరోసారి విజృంభించాడు.

ఒక దశలో 15-5తో ఆధిక్యంలో ఉండటంతో మ్యాచ్‌ను సులువుగా ముగించేలా కనిపించాడు. కానీ షి యుకి పట్టువదల్లేదు. వరుస పాయింట్లు సాధిస్తూ భారత షట్లర్‌పై ఒత్తిడి పెంచాడు.

ఒక దశలో 19-20తో ఆయుష్‌కు చేరువయ్యాడు. అయితే కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకున్న 21 ఏళ్ల భారత కుర్రాడు వెంటనే మరో పాయింట్‌ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆయుష్‌ సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

సింధు జోరు

అయితే తుదిపోరులో షి యుకి చేతిలోనే ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

ఇప్పుడు అదే ప్రత్యర్థిపై ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించి ఆయుష్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఐదు పతకాలు సాధించిన పి.వి.సింధు.. ఆరో పతకంపై కన్నేసింది.

ఈ క్రమంలో తొలి రౌండ్‌లోనే అదిరే విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్‌ సింధు 21-7, 21-11తో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌ను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో సింధు ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.

సోఫియాను అనవసర తప్పిదాలు చేసేలా ప్రేరేపించిన భారత స్టార్‌.. విరామ సమయానికి 11-2తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు

అద్భుతంగా రాణించిన సింధు

ఆ తర్వాత కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకుంది. రెండో గేమ్‌లో సోఫియా కాస్త మెరుగైన ఆటను ప్రదర్శించింది.

అయినా సింధు తన దూకుడును తగ్గించలేదు. 11-8తో విరామానికి వెళ్లిన ఆమె.. ఆ తర్వాత వేగం పెంచింది.

తెలివైన బ్యాక్‌హ్యాండ్‌ డ్రాప్‌ షాట్లు, మెరుపు స్మాష్‌లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.

మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట కూడా తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించింది.

వివరాలు

గాయత్రి-ట్రీసా ముందంజ

భారత ద్వయం 21-9, 21-13తో స్పెయిన్‌కు చెందిన పౌలా లోపెజ్‌-లూసియా రోడ్రిగ్జ్‌ జంటను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-హరిహరన్‌ జంటకు కూడా ముందంజ లభించింది.

స్కాట్‌-రేమాండ్స్‌ (ఐర్లాండ్‌) జోడీతో జరిగిన మ్యాచ్‌లో భారత జంట 21-16, 6-4తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి జోడీ గాయంతో పోటీ నుంచి వైదొలిగింది.

దీంతో అర్జున్‌-హరిహరన్‌ జంట విజేతగా నిలిచింది. ఇక పురుషుల డబుల్స్‌లో స్టార్‌ భారత జంట సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టికి తొలి రౌండ్‌లో బై లభించింది.

దీంతో వారు నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. రెండో రౌండ్‌లో అలెగ్జాండర్‌ డూన్‌-ఆడమ్‌ ప్రింగిల్‌ (స్కాట్లాండ్‌) జంటతో సాత్విక్‌-చిరాగ్‌ తలపడనున్నారు.

ADVERTISEMENT