Shane Watson: భారత్లోనే క్రేజ్ ఎక్కువ.. నాకు రెండో ఇల్లు లాంటిది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్తో తనకు ఎంతో బలమైన అనుబంధం ఉందని, ఇండియా తనకు రెండో ఇల్లు లాంటిదని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అన్నారు. సిడ్నీలోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వాట్సన్ పాల్గొని ప్రసంగించారు. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగమవడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్లోనే తనకు ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పారు. తాను 19 ఏళ్ల వయసులో తొలిసారి భారత్లో పర్యటించానని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా భారతీయ శాకాహార వంటకాలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
వివరాలు
వారితో బలమైన అనుబంధం..
''ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది.
భారతీయులు నా జీవితం, క్రికెట్ కెరీర్పై ఎంతో ప్రభావం చూపించారు.
వారితో నాకు చాలా బలమైన అనుబంధం ఉంది. భారత్ నాకు మరో ఇల్లు లాంటిది. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం.
ఆస్ట్రేలియా తరఫున సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే అవకాశం నాకు లభించింది. అయితే భారత్లో మాత్రం నాకు ఎప్పుడూ ఎంతో ఆదరణ ఉండేది.
2008లో ఐపీఎల్ (IPL) ప్రారంభమైంది. నా కెరీర్లో కీలకమైన సమయంలో ఈ టోర్నీ ద్వారా అద్భుతమైన ప్రదర్శనలు చేసే అవకాశం నాకు దక్కింది'' అని వాట్సన్ చెప్పారు.
వివరాలు
బౌలింగ్లో 92 వికెట్లు..
''ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్లో క్రికెట్ను ప్రేమించే అభిమానులు చాలా ఎక్కువ.
అయితే భారత్లో నన్ను ఎప్పుడూ పెద్దగా విమర్శించలేదనే భావన నాకు ఉండేది.
అక్కడ నాకు ఎక్కువగా మద్దతు లభించేది. అదే ఆస్ట్రేలియాలో అయితే బాగా ఆడితే ప్రశంసలు వచ్చేవి. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది'' అని వాట్సన్ వివరించారు.
షేన్ వాట్సన్ 2008 నుంచి 2020 వరకు ఐపీఎల్లో ఆడారు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
ఐపీఎల్లో మొత్తం 145 మ్యాచ్లు ఆడిన వాట్సన్ 3,874 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 92 వికెట్లు పడగొట్టారు.