Ganguly: ఆ ఫోన్ నంబర్ కోల్కతాకు చెందినదే.. బెదిరింపులపై సౌరభ్ గంగూలీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు నాలుగు రోజుల క్రితం ప్రాణహాని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. గంగూలీ దంపతులను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, గత ఆరు నెలలుగా ఇలాంటి లేఖలు తమకు అందుతున్నట్లు గంగూలీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, బెదిరింపులు పదేపదే కొనసాగడంతో విషయాన్ని సీరియస్గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై గంగూలీ స్పందించారు. బెదిరింపు లేఖల్లో పేర్కొన్న ఫోన్ నంబర్ కోల్కతాకు చెందినదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితులను గుర్తిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
వివరాలు
బెల్ఘారియా నుంచే లేఖలు వచ్చాయా?
''ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిందితులను పోలీసులు తప్పకుండా గుర్తిస్తారని ఆశిస్తున్నాను.
బెదిరింపు లేఖల్లో ఉన్న ఫోన్ నంబర్ కచ్చితంగా కోల్కతాకు చెందినదే. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం నాకు భద్రత ఉంది'' అని గంగూలీ పేర్కొన్నారు. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు పంపుతున్న వ్యక్తి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘారియా ప్రాంతానికి చెందినవాడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అక్కడి నుంచి పనిచేసే ఓ కొరియర్ సర్వీస్ ద్వారా ఈ లేఖలను పంపి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
వివరాలు
గంగూలీ దంపతులకు అందుతున్న బెదిరింపు లేఖలు..
బెదిరింపు లేఖల్లో పేర్కొన్న ఫోన్ నంబర్కు సంబంధించిన సిమ్ కార్డు కదలికలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మరింత సమాచారం సేకరించేందుకు సంబంధిత కొరియర్ ఏజెన్సీని కూడా ఇప్పటికే సంప్రదించారు.
గత ఆరు నెలలుగా గంగూలీ దంపతులకు అందుతున్న బెదిరింపు లేఖలన్నింటినీ ఒకే వ్యక్తి పంపిస్తున్నాడా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లేఖలు ఎక్కడి నుంచి పంపబడ్డాయి, వాటి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయాలను తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.