IND vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డేకు విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ జట్టు జనవరి 11 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-కివీస్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ టికెట్ల విక్రయాలపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కీలక ప్రకటన చేసింది. జనవరి 18న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో వన్డే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ 2026లో భారత జట్టు ఆడే తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్కు ముగింపు కావడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Details
విద్యార్థులకు రాయితీ టికెట్లు
ఈ వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు వడోదర, రాజ్కోట్లలో జరగనుండగా, ఇండోర్లో జరిగే మూడో మ్యాచ్ డే-నైట్ వన్డేగా అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ సౌకర్యాలను MPCA ప్రకటించింది. ఈస్ట్ స్టాండ్ లోయర్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో విద్యార్థుల కోసం పరిమిత సంఖ్యలో రాయితీ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈస్ట్ స్టాండ్ (లోయర్): రూ.750 ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.950
Details
స్టూడెంట్ ఐడీ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
ప్రతి విద్యార్థికి ఒక్క టికెట్ మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి, చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ ఐడీ కార్డు లేదా అకడమిక్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. MPCA ధృవీకరణ అనంతరం వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ లింక్ పంపబడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31, 2025 ఉదయం 11 గంటల నుంచి జనవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు లేదా కోటా పూర్తయ్యే వరకు కొనసాగుతుందని MPCA వెల్లడించింది.
Details
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
దివ్యాంగుల కోసం నార్త్-ఈస్ట్ గ్యాలరీలో రూ.300 ధరతో ప్రత్యేక టికెట్లను MPCA కేటాయించింది. ప్రభుత్వ జారీ చేసిన వైకల్య సర్టిఫికెట్ను అప్లోడ్ చేయడం తప్పనిసరిగా పేర్కొంది. వీల్చైర్ అవసరమైతే వాటిని స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సాధారణ టికెట్ల ధరలు ఈ మ్యాచ్కు సాధారణ టికెట్ల ధరలు రూ.800 నుంచి రూ.7,000 వరకు ఉన్నాయి. అన్ని కేటగిరీల టికెట్లు 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' అనే అధికారిక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారానే విక్రయిస్తారు.
Details
టికెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి
సౌత్ పావిలియన్ (లోయర్): రూ.5,500 సౌత్ పావిలియన్ (ఫస్ట్ ఫ్లోర్): రూ.7,000 సౌత్ పావిలియన్ (సెకండ్ ఫ్లోర్): రూ.6,500 సౌత్ పావిలియన్ (థర్డ్ ఫ్లోర్): రూ.5,000 ఈస్ట్ స్టాండ్ (లోయర్ - చైర్స్): రూ.800 ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,250 ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,100 ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,000 వెస్ట్ స్టాండ్ (లోయర్ - చైర్స్): రూ.900 వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,500 వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,400 వెస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,250
Details
గిల్ నాయకత్వం వహించే అవకాశం
ఇండోర్ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. గాయాల నుంచి కోలుకుంటున్న శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ సిరీస్కు సంబంధించిన భారత జట్టును జనవరి తొలి వారంలో బీసీసీఐ ప్రకటించనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు ఇదే చివరి సిరీస్ కావడం విశేషం.