SRH: టికెట్ల ధరలపై అభిమానుల ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడంటే స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం సహజం. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. గత మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన కోహ్లి ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్ ధరలను విపరీతంగా పెంచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారీగా పెంచిన సన్ రైజర్స్..
ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు సంబంధించిన టికెట్ల ధరలను సన్రైజర్స్ భారీగా పెంచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరువైన ఆర్సీబీ తొలి రెండు స్థానాల్లో నిలవడానికి, మరోవైపు ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి ఈ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉండటంతో అభిమానుల్లో భారీ డిమాండ్ నెలకొంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు టికెట్ల విక్రయాలు ప్రారంభించగా, సుమారు నాలుగు లక్షల మంది ఆన్లైన్లో వేచి ఉండటం విశేషం. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం కేవలం 39 వేల మందికే పరిమితమైనప్పటికీ, దానికి అనేక రెట్లు ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడటం అభిమానుల ఆసక్తిని స్పష్టంగా చూపించింది.
వివరాలు
అభిమానులు తీవ్ర అసంతృప్తి..
అయితే టికెట్ల ధరలు భారీగా పెరగడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. కనిష్ట టికెట్ ధరను రూ.1,950గా నిర్ణయించగా, అత్యధిక ధర రూ.45,000 వరకు చేరింది. సౌత్ రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ.45 వేలుగా నిర్ణయించారు. వెస్ట్ రెండో అంతస్తు కార్పొరేట్ బాక్స్కు రూ.30 వేల ధర పెట్టగా, ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్, వెస్ట్ లాంజ్ల టికెట్లు రూ.20 వేలుగా ఉన్నాయి.
వివరాలు
పూర్తిగా అమ్ముడైన టికెట్లు..
సాధారణ అభిమానులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈస్ట్, వెస్ట్ స్టాండ్ల మొదటి అంతస్తు టికెట్ల ధర రూ.4,500గా, గ్రౌండ్ ఫ్లోర్ టికెట్ల ధర రూ.6 వేలుగా నిర్ణయించారు. నార్త్ స్టాండ్ రెండో టెర్రస్ టికెట్ ధర రూ.1,950గా ఉండటం అత్యల్ప ధరగా నిలిచింది. అదే విధంగా ఇతర టికెట్ల ధరలు వరుసగా రూ.2,050, రూ.3,250, రూ.3,500, రూ.4,500, రూ.6,000, రూ.9,000, రూ.10,000, రూ.12,000, రూ.13,000, రూ.20,000, రూ.30,000, రూ.40,000 వరకు ఉన్నాయి. టికెట్ ధరలు భారీగా ఉన్నప్పటికీ, అమ్మకాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అన్ని టికెట్లు పూర్తిగా అమ్ముడైనట్లు యాప్లో కనిపించడం విశేషంగా మారింది.