IND vs SL: ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. రెండు టెస్టుల షెడ్యూల్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ ఆడనుంది. ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. సిరీస్లోని తొలి టెస్టు గాలె వేదికగా జరగనుండగా, రెండో టెస్టుకు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు మ్యాచ్లూ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
టెస్టు మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు: ఆగస్టు 15 నుంచి 19 వరకు - గాలె రెండో టెస్టు: ఆగస్టు 23 నుంచి 27 వరకు - కొలంబో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నాలుగో సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 48.15 శాతం విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడిన భారత జట్టు నాలుగింటిలో విజయం సాధించగా, మరో నాలుగు మ్యాచ్ల్లో పరాజయం చవిచూసింది.
వివరాలు
భారత్కు అత్యంత కీలకమైన సిరీస్..
డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం తప్పనిసరి. అందువల్ల ఇకపై భారత్ ఆడే ప్రతి టెస్టు సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీలంకను తేలికగా తీసుకుంటే భారత్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో స్వదేశంలో శ్రీలంక బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. కాగా, 2017 తర్వాత టెస్టు సిరీస్ కోసం భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. గత పర్యటనలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసి ఆధిపత్యాన్ని చాటుకుంది.