LOADING...
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక బోర్డు కీలక నిర్ణయం.. కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!
కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక బోర్డు కీలక నిర్ణయం.. కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో జరిగే టోర్నీలో కప్‌ను చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో లంక జట్టు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌ను శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ప్రపంచకప్ టోర్నీ పూర్తయ్యే వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకాన్ని బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శ్రీలంక క్రికెట్ అధికారికంగా వెల్లడించింది. ఏడేళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన శ్రీధర్ ఇప్పుడు లంక ఆటగాళ్ల ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు. పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక,భారత్‌తో కలిసి ఈ మెగా టోర్నీని నిర్వహించనుంది.

వివరాలు 

శ్రీలంక ఆటగాళ్లు సమిష్టిగా పోరాడే స్వభావం కలవారు:  శ్రీధర్ 

ఈ నేపథ్యంలో జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో అనుభవజ్ఞుడైన శ్రీధర్‌ను సంప్రదించింది. ఫీల్డింగ్ కోచ్‌గా విశేష అనుభవం ఉన్న ఆయనను ప్రపంచకప్ ముగిసే వరకు జట్టుతో కొనసాగాలని లంక క్రికెట్ కోరింది. శ్రీలంక క్రికెట్ తనపై పెట్టిన నమ్మకంపై శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీలంక ఆటగాళ్లు ఎంతో ప్రతిభావంతులని, అందరూ సమిష్టిగా పోరాడే స్వభావం కలవారని శ్రీధర్ ప్రశంసించారు. ఫీల్డింగ్ కోచ్‌గా తన పని కొత్త వ్యవస్థను నిర్మించడం కాదని, ఆటగాళ్లలో సహజంగా ఉన్న అథ్లెటిజం, ఆటపై అవగాహనను మరింత పెంపొందించడమే తన లక్ష్యమని చెప్పారు. చురుకైన చేతులు, వేగమైన కదలికలు, భయం లేకుండా ఫీల్డింగ్ చేయడం వంటి అంశాలు క్రమంగా మెరుగవుతాయని ఆయన వివరించారు.

వివరాలు 

ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ 

త్వరలో పాకిస్థాన్, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లతో శ్రీలంక జట్టుతో శ్రీధర్ ప్రయాణం ప్రారంభం కానుంది. బీసీసీఐ లెవల్-3 అర్హత పొందిన శ్రీధర్ 2014 నుంచి 2021 వరకు భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఇటీవల అఫ్గానిస్థాన్ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభం తర్వాత మరుసటి రోజే ఐర్లాండ్‌తో శ్రీలంక తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంక కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!

Advertisement