Abhishek Sharma: 194.92 స్ట్రైక్ రేట్: టీ20లో విధ్వంసకర బ్యాటర్.. ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
నూనుగు మీసాల కుర్రాడు అభిషేక్ శర్మ వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్నాడు. 25 ఏళ్ల ఈ ఆటగాడు సెహ్వాగ్, ధోని వంటి లెజెండ్లను కూడా మరిపించేలా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. చివరకు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు యువరాజ్ సింగ్ నే తదదన్నేలా... బంతికే భయం పుట్టేలా ఆడుతున్నాడు. క్రీజులో శివతాండవం చేస్తూ, ఐసిసి ర్యాంకింగ్స్లో టాప్ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక, ఇంటర్నేషనల్ టీ20లో 929 పాయింట్స్ తో నెంబర్ వన్ బ్యాటర్గా ఎదిగాడు.
వివరాలు
అభిషేక్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా..?
టీమిండియా తరఫున 37 ఇంటర్నేషనల్ టీ20ల్లో 1267 పరుగులు చేసిన అభిషేక్, ఈ పరుగులు సాధించే క్రమంలో 194.92 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఫార్మాట్లో అతడు రెండు సెంచరీలు కొట్టాడు. అతడి హయ్యెస్ట్ స్కోరు 135 పరుగులు. ఈ గణాంకాలు చూస్తేనే అతను ఎంత భయంకరమైన ఆటగాడో అర్థమవుతుంది.
వివరాలు
2024 వరకు అభిషేక్ ఎక్కడున్నాడు..?
ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్ అభిషేక్ శర్మ 2023కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. 2018 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నా అతడికి ఎక్కడా సరైన గుర్తింపు రాలేదు. ఢిల్లీ డేర్డెవిల్స్లో ఒక సీజన్ ఆడి,తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2023 వరకు ఆ జట్టులో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.కానీ ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ అతనిని ప్రపంచానికి పరిచయం చేసింది, టీమిండియాకు ఓ కొత్త అణిముత్యాన్ని అందించింది. యువరాజ్ కోచింగ్ లో రాటుదేలిన అభిషేక్.. 2023 వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సరైన మార్గదర్శకత్వం ఇచ్చాడు. ప్రత్యేక కోచింగ్తో లోపాలను సరిదిద్దాడు.కేవలం ఏడాదిలోనే అభిషేక్ పరిపూర్ణ క్రికెటర్గా మారి కొత్త ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
వివరాలు
ట్రావిస్ హెడ్తో కలిసి విధ్వంసం
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా ఆడిన అభిషేక్ అద్భుత ప్రదర్శన చూపించాడు. ఈ ప్రదర్శనతోనే టీమిండియా T20I జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్రం చేయగానే సెంచరీ కొట్టి, ప్రపంచానికి ప్రమాదకరమైన బ్యాటర్ వచ్చినట్లు చూపించాడు. 2024 ఐపీఎల్లో హైపర్గా ఆడిన అభిషేక్, 2025 సీజన్లో ట్రావిస్ హెడ్తో కలసి అద్భుత ప్రదర్శన చూపించాడు. హెడ్ ప్రదర్శనతో ప్రభావితమవడమే కాదు,యువీ కోచింగ్లో శిక్షణ పొందిన అభిషేక్ తన సంపూర్ణ ప్రతిభను చూపించాడు. సన్రైజర్స్ ఓపెనర్లు T20 క్రికెట్లో కొత్త విధ్వంసక బ్యాటింగ్ ట్రెండ్ను తీసుకువచ్చారు. ఈ సీజన్ తర్వాత టీమిండియా సెలెక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారు, అది నమ్మకాన్ని నిలబెట్టి పరుగుల వరద కొనసాగిస్తూ, నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాడు.
వివరాలు
గురువు రికార్డుకే ఎసరు..
2024కి ముందు కొంతమంది మాత్రమే గుర్తించిన అభిషేక్, 2026 జనవరిలో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. ఈ ఘనతలో యువరాజ్ సింగ్ పాత్ర విశేషం. 2011 ప్రపంచకప్లో యువీ "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్" గా నిలిచాడు. అభిషేక్ ఆలోచనా విధానం కూడా యువీ లాంటిదే. సిక్సర్లు కొట్టడంలోనూ యువీ లాగే ప్రతిభావంతుడు. ఇటీవల గువాహటిలో భారత్-న్యూజిలాండ్ 3వ టీ20లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్, యువీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (12 బంతులు) రికార్డును బద్దలుగొడతాడని అనిపించింది ఇదే జరిగితే గురువును మించిన శిష్యుడు అయ్యేవాడు... ఇప్పుడు గురువుకు తగ్గ శిష్యుడు అయ్యాడు అభిషేక్.