LOADING...
Nisesh Basava Reddy: ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు యువకుడి సంచలనం.. ఫ్రిట్జ్‌ను షాక్‌కు గురి చేసిన నిశేష్
ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు యువకుడి సంచలనం.. ఫ్రిట్జ్‌ను షాక్‌కు గురి చేసిన నిశేష్

Nisesh Basava Reddy: ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు యువకుడి సంచలనం.. ఫ్రిట్జ్‌ను షాక్‌కు గురి చేసిన నిశేష్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత సంతతికి చెందిన తెలుగు యువ ఆటగాడు నిషేష్ బసవరెడ్డి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21 ఏళ్ల నిశేష్ ప్రపంచ ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో తొలిసారి రోలాండ్ గారోస్ మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 7-6(5), 7-6(5), 6-7(9), 6-1 తేడాతో విజయం సాధించాడు. కోర్ట్ సుజానే లెంగ్లెన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే నిశేష్ అద్భుత ఆటతీరును కనబరిచాడు.

వివరాలు

ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన వివేశ్

మోకాలి గాయం కారణంగా రెండు నెలల పాటు ఆటకు దూరమైన ఫ్రిట్జ్ గత వారమే తిరిగి కోర్టులోకి వచ్చినప్పటికీ, నిశేష్ దూకుడుకు తట్టుకోలేకపోయాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో పైచేయి సాధించిన నిశేష్, రెండో సెట్‌లో కూడా అద్భుతమైన డ్రాప్ షాట్లు, వేగంలో మార్పులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఆ సెట్‌ను కూడా టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించాడు.

వివరాలు

నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్న నివేశ్

మూడో సెట్‌లో మాత్రం ఫ్రిట్జ్ గట్టిగా ప్రతిఘటించాడు. మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకొని టైబ్రేక్‌లో సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను నాలుగో సెట్‌కు తీసుకెళ్లాడు. అయితే కీలకమైన ఆ దశలో నిశేష్ మరింత ధైర్యంగా ఆడి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం నిశేష్ మాట్లాడుతూ.. "మూడో సెట్ కోల్పోయిన తర్వాత కూడా మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెద్ద టోర్నీల్లో ప్రతి ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ విజయం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. నాలుగో సెట్‌లో నేను ఆడిన తీరు నా జీవితంలోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటి అని పేర్కొన్నాడు.

Advertisement

వివరాలు

ఎవరీ నిశేష్ బసవరెడ్డి?

నిశేష్ బసవరెడ్డి 2005లో కాలిఫోర్నియాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సాయి ప్రసన్న, మురళీకృష్ణ బసవరెడ్డి. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. వృత్తిరీత్యా 1999లో అమెరికాకు వలస వెళ్లిన ఈ కుటుంబంలో, తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే నిశేష్ టెన్నిస్‌లో అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే జూనియర్ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించిన అతడు 2022లో జూనియర్ యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మోకాలి గాయాల కారణంగా శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ, పట్టుదలతో తిరిగి కోలుకొని తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు.

Advertisement

వివరాలు

టోర్నీల్లో అద్భుత విజయాల నమోదు

2024లో ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత ఛాలెంజర్ టోర్నీల్లో అద్భుత విజయాలు సాధించాడు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జొకోవిచ్‌తో తలపడి తొలి సెట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు టాప్-10 ప్లేయర్ ఫ్రిట్జ్‌పై సాధించిన ఈ చారిత్రక విజయంతో నిశేష్ ఏటీపీ టూర్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో రౌండ్‌లో నిశేష్, అలెగ్జాండర్ షెవ్చెంకో లేదా అలెక్స్ మిచెల్సెన్‌తో తలపడనున్నాడు.

Advertisement