T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. భారత్ జోరందుకునేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత మహిళల జట్టు.. తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల టీ20 ఆసియా కప్ కోసం సిద్ధమైన టీమిండియా.. ఆదివారం థాయ్లాండ్తో జరిగే మ్యాచ్తో టైటిల్ వేటను ప్రారంభించనుంది. గ్రూప్-ఎలో భారత్ తన తొలి పోరులో థాయ్లాండ్ను ఎదుర్కోనుంది. మహిళల ఆసియాకప్లో భారత జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు ఐదు టోర్నీలు జరగగా.. భారత్ మూడుసార్లు టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం జట్టు ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
16 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా తొమ్మిది పరాజయాలు..
హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ ఏడాది ఆడిన 16 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా తొమ్మిది పరాజయాలను చవిచూసింది.
అంతేకాకుండా టీ20 ప్రపంచకప్లోనూ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
వచ్చే నెలలో ఆసియా క్రీడలు కూడా జరగనున్న నేపథ్యంలో.. ఈ టోర్నీలో ఫామ్ను అందుకోవడంతో పాటు జట్టులో నిలకడ తీసుకురావడం భారత్కు కీలకంగా మారింది.
మరోవైపు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫామ్పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆమె తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్లుగా స్మృతి మంధాన, షెఫాలి వర్మ ఉండటంతో భారత బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది.
బ్యాటర్లు కూడా అదే జోరును కొనసాగిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ భారతజట్టు మరింత మెరుగుపడాల్సి ఉంది.
వివరాలు
పటిష్ఠంగా భారత స్పిన్ విభాగం..
బౌలింగ్ విషయానికొస్తే.. తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మలతో భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.
వీరికి రాధా యాదవ్ కూడా తోడుగా ఉంది. పేస్ విభాగంలో రేణుక సింగ్, అరుంధతి, క్రాంతి గౌడ్, నందని శర్మ ఉన్నారు.
వీరిలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్నది చూడాలి.
థాయ్లాండ్ జట్టు నుంచి భారత్కు పెద్దగా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
గ్రూప్-ఎలో భారత్, థాయ్లాండ్తో పాటు హాంకాంగ్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఈ గ్రూప్లో పాకిస్థాన్ మాత్రమే భారత్కు కాస్త గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
దీంతో ఆసియాకప్లో శుభారంభం చేయడంతో పాటు.. టోర్నీ ద్వారా తిరిగి ఫామ్ను అందుకోవాలని టీమిండియా భావిస్తోంది.