కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం
WFI body suspended: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను కేంద్రం రద్దు చేసింది. తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ నియామకాన్ని కూడా కేంద్రం రద్దు చేసింది. సమాఖ్య తీసుకున్న నిర్ణయాలను అన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో అనితా షెరాన్పై సంజయ్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ కుమార్ సింగ్కు 40 ఓట్లు రాగా, అనితా షెరాన్కు 7 ఓట్లు వచ్చాయి.
సంజయ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సంజయ్ సింగ్ సన్నిహితుడని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా ఎన్నిక కావడాన్ని రెజ్లర్లు వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇతర రెజ్లర్లు కూడా నిరసనకు దిగారు. సాక్షి రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం నూతన బాడీని సస్పెండ్ చేయడం గమనార్హం.