Ishan Kishan: అప్పుడు సచిన్ వీరంగం.. ఇప్పుడు ఇషాన్ కిషన్ శివతాండవం
ఈ వార్తాకథనం ఏంటి
శివరాత్రి, టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్... ఈ రెండు పదాలు కలిసి వినిపిస్తే ముందుతరం క్రికెట్ అభిమానుల కళ్ల ముందుకు 23 ఏళ్ల క్రితం జరిగిన ఓ మధుర జ్ఞాపకం మెదులుతుంది. 2003 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా మార్చి 1న, శివరాత్రి రోజునే భారత్-పాక్ పోరు జరిగింది. ఆ మ్యాచ్లో పాకిస్థాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యం అప్పటి పరిస్థితుల్లో పెద్ద సవాలే. ఆ కాలంలో 250 దాటిన లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. కానీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.
Details
అభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతి
ముఖ్యంగా షోయాబ్ ఆక్తర్, వకార్ యూనిస్ వంటి వేగవంతమైన బౌలర్లపై ఆడిన అద్భుత అప్పర్కట్ షాట్లు ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా నిలిచాయి. ఆ ఇన్నింగ్స్, ఆ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ శివరాత్రి రోజునే ప్రపంచకప్ (టీ20) వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఆ 2003 ఇన్నింగ్స్తో పోల్చడం సాధ్యం కాకపోయినా, ఈసారి యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మెరుపు బ్యాటింగ్తో పాక్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. కీలక సమయంలో ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇలా శివరాత్రి రోజున భారత్-పాక్ పోరు మరోసారి అభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతిని అందించింది.